ఉగ్రవాదుల సోదరి కల్నల్ సోఫియా ఖురేషి.. బీజేపీ మంత్రి వాచాలత!

కల్నల్ సోఫియా ఖురేషి పై బీజేపీ మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఉగ్రవాదుల సోదరిగా పేర్కొంటూ మధ్యప్రదేశ్  మంత్రి విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను మీడియాకు వివరించిన కల్నల్ సోఫియా ఖురేషీ 1999లో ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్‌లో చేరారు.  2016లో మల్టీనేషనల్ మిలటరీ విన్యాసాలకు సారథ్యం వహించిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమెపై మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విజయ్ షా  టెర్రరిస్టుల సోదరి'గా పేర్కొంటూ ఆమెను కించపరచేలా మాట్లాడారు.  మహులోని  రాయ్‌కుంద గ్రామంలో జరిగిన జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన విజయ్ షా ఆపరేషన్ సిందూర్ విజయం, మోడీ గొప్పదనం గురించి మాట్లాడుతూ.. మన ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచేసి పారిపోయిన ముష్కరులకు వారి సొంత సోదరితోనే గట్టి సమాధానం చెప్పామన్నారు.  విజయ్ షా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్.

దీంతో వెనక్కు తగ్గిన మంత్రి విజయ్ షా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ క్షమాపణలు కోరారు. అదలా ఉంటే.. మంత్రి విజయ్ షాపై తక్షణమే పోలీసు కేసు నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంత్రి వ్యాఖ్యలపై సుమోటోగా మధ్య ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. మహిళా కమిషన్ సైతం సీరియస్ గా స్పందించింది. మంత్రి పేరు ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.  కాంగ్రెస్ పార్టీ అయితే విజయ్ షాను వెంటనే కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేసింది.