ఇకపై తోక ఝాడిస్తే పాక్ పని దబిడిదిబిడే!
posted on May 15, 2025 11:12AM
.webp)
ఆపరేషన్ సిందూర్ ఆపి అమెరికాకు మోకాలొడ్డిన ప్రధాని మోడీ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఈ ఆపరేషన్ ద్వారా ఇండియా పాకిస్థాన్ కు కలిగించిన నష్టం నుంచి కోలుకోవడానికి రెండుమూడు దశాబ్దాలు పడుతుందంటూ.. యుద్ధ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలు, విశ్లేషణలు భారత ప్రభుత్వం ఎంత సంయమనంతో వ్యవహరించిందో.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు సాధించిందో అవగతమౌతోంది. తమ యుద్ధం ఉగ్రవాదంపైనే తప్ప.. పాక్ పౌరులపై కాదని విస్పష్టంగా ప్రకటించిన ప్రధాని, కాల్పుల విమరణ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం మళ్లీ భారత్ పై పంజా విసరనంత వరకేననీ, అటువైపు నుంచి ఒక్క ఉగ్రదాడి జరిగినా యుద్ధమేననీ విస్పష్ట హెచ్చరిక చేశారు.
అదే సమయంలో కాల్పుల విరమణకు మాత్రమే అంగీకరించామనీ, పాక్ తో దౌత్య సంబంధాల ప్రశ్నే లేదనీ తేల్చేసిన ఆయన ఇండస్ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందన్న తేల్చేశారు. ఆపరేషన్ సిందూర్ ఆగలేదని పాకిస్తాన్ నుంచి మళ్లీ ఉగ్రదాడి జరిగితే యుద్ధ చర్యగానే భావించి ప్రతి దాడులు చేస్తామనీ హెచ్చరించారు. ఇప్పటికే కోలుకోలేని దెబ్బతిని ఉన్న పాకిస్థాన్ కు ఈ హెచ్చరిక చాలదా? మరోసారి భారత్ పైకి ఉగ్రవాదులను ప్రేరేపించాలంటే వణుకుపుట్టడానికి అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఇక పాకిస్తాన్ తో చర్చలు అంటూ జరిగితే.. అవి ఉగ్రవాద నిర్మూలన,పీవోకే అంశాలపైనేననీ క్లియర్ కట్ గా చెప్పేశారు.
అలాగే పాక్,భారత్ మధ్య ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ప్రకటించడం ద్వారా పరోక్షంగా అమెరికాకు మీ మర్యాద మీరు కాపాడుకోండన్న హెచ్చరికా చేశారు. పాక్ యుద్ధం ఆపమని కాళ్ల బేరానికి రావడం,అమాయక పౌరులు సంక్షోభంలో పడటం ఇష్టం లేక మాత్రమే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించిందని కుండబద్దలు కొట్టినట్లు మోడీ చెప్పారు. ఇక్కడ కొసమెరుపేంటంటే.. కాల్పుల విరమణ తరువాత కూడా పాకిస్థాన్ భారత్ కాళ్లా వేళ్లా పడుతోంది. సింధు జలాల ఒప్పందం రద్దు పునస్సమీక్షించండి ప్లీజ్ అంటూ బతిమలాడుకుంటోంది. ఈ ఒప్పందం రద్దు కారణంగా నీటి సమస్యతో నానా ఇబ్బందులూ ఎదుర్కొంటున్నామంటూ లేఖ రాసింది. దీనిని బట్టే మోడీ తన వ్యూహాలతో పాకిస్థాన్ ను చక్రబంధంలో బిగించేశారనీ, ఆ దేశం ఇక తోక జాడించే అవకాశాలు ఇంచుమించు లేవనీ అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.