ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు స్పీకర్ షెడ్యూల్
posted on Sep 27, 2025 3:19PM
.webp)
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణకు అసెంబ్లీ స్పీకర్ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కార్యాలయం శనివారం (సెప్టెంబర్ 27)షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చిన తరువాత.. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ , బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి లు తెరాస గూటిని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతొ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలలలో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ను ఆదేశించింది. దీంతో స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో పలువురు తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు ఆ నోటీసులకు బదులు ఇచ్చారు. దీంతో స్పీకర్ వారిని విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం ఎమ్మెల్యేల విచారణకు షెడ్యూల్ విడుదల చేసింది. ఆ షెడ్యూల్ ప్రకారం. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రకాష్ గౌడ్, 12 గంటలకు కాలే యాదయ్య, మధ్యాహ్నం ఒంటి గంటకు మహిపాల్రెడ్డి, 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని స్పీకర్ విచారించనున్నారు.