జగన్ ప్రలోభాలకు లొంగిన శంకరయ్య!
posted on Sep 25, 2025 3:09PM

సీఐ శంకరయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి లీగల్ నోటీసులు పంపడం వెనుక జగన్ ప్రలోభాలు ఉన్నాయా? వచ్చే ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు టికెట్ ఇస్తానని ప్రలోభపెట్టే జగన్ శంకరయ్యను పావుగా వాడుకుంటున్నారా? అంటే తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాటలను బట్టి ఔననే సమాధానం వస్తున్నది. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా జగన్ కొత్త నాటకానికి తెరలేపారని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు పంపడం వెనుక కుట్ర ఉందన్నారు. ఈ వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్న రాంగోపాల్ రెడ్డి.. ఇందకు బాధ్యులైన వారు మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా శంకరయ్య విధుల్లో ఉన్నారని గుర్తు చేసిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి.. ఆ రోజున నిందితులు సాక్ష్యాధారాలను ధ్వంసం చేస్తుంటే, వారికి శంకరయ్య పూర్తిగా సహకరించారని పేర్కొన్నారు. అప్పట్లో ఆర్థిక ప్రయోజనాలు పొందడంతో పాటు పలు సెటిల్మెంట్లు చేసుకున్న తర్వాతే.. ఆయన నిందితులకు అనుకూలంగా మారారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ హైకోర్టును ప్రభావితం చేసే ఉద్దేశంతో.. వివేకా హత్య కేసులోని నిందితులకు మేలు చేకూర్చడానికే శంకరయ్య ఈ కొత్త డ్రామా ఆడుతున్నారని రాంగోపాల్రెడ్డి అన్నారు. దీని వెనుక జగన్ ఉన్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రికి నోటీసులు పంపడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.