పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. కానిస్టేబుల్ మృతి
posted on May 25, 2025 11:37AM
.webp)
పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి షాపూర్ బెంగళూరు జాతీయ రహదారిపై ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ మార్గంలో వెళ్తున్న వాహనాలను కానిస్టేబుల్స్ తనిఖీ చేస్తున్నారు. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన లారీ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీ కొట్టింది.
వాహనం వద్దనున్న విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు కానిస్టేబుల్స్ కు తీవ్రగాయాలైనట్లు సమాచారం. తోటి కానిస్టేబుల్స్ వారిని సమీప ఆస్పత్రికి తరలించగా.. చికిత్స చేసిన వైద్యులు ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్ మితిమీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ విజయ్ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్నారు.