వల్లభనేని వంశీ బ్యాడ్ టైమ్.. సుప్రీంలో చుక్కెదురు
posted on Jul 17, 2025 12:14PM

పలు కేసుల్లో జైలు పాలై నానా కష్టాలు పడి బెయిల్పై బయటకు వచ్చిన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇంకా బ్యాడ్ టైమ్ నడుస్తూనే ఉంది. తాజాగా వంశీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వంశీకి ఏపీ హైకోర్టు అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్పై విచారణకు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్చంద్ర శర్మ ధర్మాసనం అనుమతిచ్చింది. వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.
రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఈ పిటిషన్పై తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసు మెరిట్స్ లోకి, పీటీ వారెంట్స్లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. ఇరువురి వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసిన నాలుగు వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.