పిల్ల సజ్జల.. మద్యం కుంభకోణంలోనూ పాత్ర?
posted on Sep 4, 2025 12:19PM
.webp)
ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధకారంలో ఉన్న సమయంలో సజ్జల పార్టీనీ, ప్రభుత్వాన్నీ గుప్పిట పట్టి ఓ ఆటాడుకుంటే.. ఆయన పుత్రరత్నం పిల్ల సజ్జల.. అదే నండి సజ్జల్ బార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా వింగ్ కు చీఫ్ గా పెత్తనం చెలయించారు. పిల్ల సజ్జల నేతృత్వంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ అసభ్య పోస్టులు, అశ్లీల మార్ఫింగ్ వీడియోల విషయంలో కొత్త పుంతలు తొక్కింది. అయితే ఎప్పుడైతే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిందో.. అప్పటి నుంచీ పిల్ల సజ్జల కనిపించడం లేదు. వినిపించడం లేదు.
సోషల్ మీడియా పోస్టుల విషయంలో తనపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసులలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లి అరెస్టు కాకుండా తప్పించుకున్న పిల్ల సజ్జల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారంటున్నారు. ఏకంగా మద్యం కుంభకోణం సొమ్ములను దాచడానికి, వాటిని అవసరమైన చోటికి తరలించి తిరిగి రప్పించుకోవడానికీ ఏర్పాటు చేసిన ఓ కంపెనీలో సజ్జల భార్గవ్ రెడ్డి ఓ డైరెక్టర్ గా ఉన్నట్లు సిట్ గుర్తించింది. మద్యం కుంభకోణం సొమ్ములను రూట్ చేయడానికి ఏర్పాటు చేసిన పలు సూట్ కేస్ కంపెనీల్లో ఒక దానిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డి కూడా ఓ డైరెక్టర్ గా ఉన్నట్లు సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. అది కూడా ఎలాగంటే.. మద్యం కుంభకోణం స్కాం కు సంబంధించి గత రెండు రోజులుగా సిట్ అధికారులు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, వారికి చెందిన బినామీల నివాసాలు, కార్యాలయాలలో సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే మద్యం కుంభకోణం సొమ్మును తరలించడం కోసం ఏర్పాటు చేసిన ఒక కంపెనీలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి ప్రద్యుమ్నలు భాగస్వాములుగా ఉన్నట్లు నిర్ధారించే పత్రాలు బయల్పడ్డాయని తెలుస్తోంది. దీంతో పిల్ల సజ్జల ఇక తప్పించుకునే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు.
ఇలా ఉండగా తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇంట్లో వరుసగా రెండో రోజు కూడా సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం(సెప్టెంబర్ 3) వారం హైదరాబాద్ లో మోహిత్ రెడ్డి ఆఫీసుతో పాటు తుమ్మగుంటలో భాస్కర్ రెడ్డి నివాసంలో తనిఖీలు జరిగాయి. గురువారం వారం (సెప్టెంబర్ 4) భాస్కరరెడ్డి ఇంట్లో జరుగుతున్న తనిఖీల్లో సిట్ అధికా రులతో పాటు విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.