సినీనటి రూపా గంగూలీపై తృణమూల్ కార్యకర్తల దాడి

పశ్చిమబెంగాల్ బీజేపీ నాయకురాలు, సినీనటి రూపా గంగూలీపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. దక్షిణ 24 పరగణ జిల్లాలోని కాక్‌డ్విప్‌‌లో తృణమూల్ కాంగ్రెస్ మద్ధతుదారుల దాడిలో గాయపడి కాక్ డ్విప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తను పరామర్శించేందుకు ఆమె వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈశ్వరిపూర్ గ్రామం వద్ద కొంతమంది ఆమె కారును అడ్డుకున్నారు. కారును ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా ఆమెపై చేయి చేసుకున్నారు . ఈ ఘటనలో రూపా గంగూలీ తలకు గాయం కావడంతో ఆమెను డైమండ్ హార్బర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. స్థానిక టీఎంసీ నేతలే ఈ దాడికి పాల్పడ్డారని, అందుకు కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.