రేవంత్ చెప్పిన సీత కథ.. కేసీఆర్ వింటే మైండ్ బ్లాంక్...
posted on Jul 7, 2021 5:41PM
పంచ్లు.. పటాకాలు.. పేల్చడంలో రేవంత్ తర్వాతే ఎవరైనా. అందులోనూ అది కేసీఆర్ మీద అయితే.. మరింత మజాగా మాట్లాడతారు. కేసీఆర్ను కవ్వించడంలోను.. కుళ్లబొడవడంలోనూ.. రేవంత్ తర్వాతే ఎవరైనా. అలాంటిది ఇక ఆయన టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కేసీఆర్ మీద విరుచుకుపడితే ఎట్టా ఉంటాదో తెలుసా..? రేవంత్ నోటి నుంచి వచ్చిన విమర్శలు ఎంత వాడి వేడిగా ఉన్నాయో తెలుసా..? కేసీఆర్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
లేటెస్ట్ స్పీచ్లో ఎప్పటిలానే కేసీఆర్పై గాటైన విమర్శలతో పాటు రేవంత్ చెప్పిన రామాయణ కథ రక్తి కట్టించింది. రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ తల్లిని మనం ఎవరం చూడలేదు. తెలంగాణ ఇచ్చిన సోనియానే మనకు తెలంగాణ తల్లితో సమానం. ఎంతమంది అడ్డుపడ్డా సోనియా తెలంగాణ ఇచ్చారు. అందుకే, ప్రతీ ఇంట్లో సోనియా పటం ఉండాలన్నారు రేవంత్రెడ్డి. ఆ సమయంలో రేవంత్రెడ్డి సీత కథను ఇంట్రెస్టింగ్గా చెప్పారు.
రామాయణంలో సీతను ఎత్తుకెళ్లేందుకు రావణాసురుడు మారీచుడితో కలిసి మాయ లేడి రూపంలో వచ్చి సీతమ్మ తల్లిని అపహరించారు. సీతమ్మను లంకలో దాచిపెట్టినట్టే.. తెలంగాణ ప్రజలు పూజించే తెలంగాణ తల్లిని కేసీఆర్.. తన ఫామ్ హౌసులో దాచి పెట్టుకున్నారని ఆరోపించారు.
మారీచుడు, రావణాసురుడు కలిస్తేనే కేసీఆర్ అని విమర్శలు చేశారు. లంకలో ఉన్న సీతను కాపాడేందుకు రాముడికి వానర సేన ఎలా సాయం చేసిందో.. టీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే కార్యకర్తలు వానర సేనలా పని చేయాలని పిలుపిచ్చారు రేవంత్రెడ్డి. రెండేళ్లు కష్టపడితే.. ఇక విజయం మనదే అని కేడర్లో జోష్ నింపారు.
ఇలా.. తెలంగాణ తల్లిని సీతమ్మతో పోల్చి.. సోనియమ్మను తెలంగాణ తల్లిని చేసి.. కేసీఆర్ను రావణాసురుడు, మరీచుడితో జతకట్టి.. పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి చేసిన తొలి ప్రసంగం విశేషంగా ఆకట్టుకుంటోంది.