బ్యాంకు ఖాతాదారులు క్లెయిమ్ చేసుకోని సొమ్ము రూ.67 వేల కోట్లు
posted on Jul 29, 2025 7:55PM

కష్టపడి సంపాదించిన డబ్బులను బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లలో దాచుకుంటారు. అవసరమైనప్పుడు వాటిని తీసుకుంటారు. వాటికి బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి. అయితే, డిపాజిట్ చేసి ఎవరూ క్లెయిమ్ చేసుకోని డబ్బు పెరిగిపోతోంది. పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లలోని బ్యాంకుల్లో జూన్ 30, 2025 నాటికి ఎవరూ తీసుకోని డబ్బులు (అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు) ఏకంగా రూ. 67003 కోట్లు ఉన్నాయి. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటుగా ప్రైవేట్ బ్యాంకుల్లోనూ అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు పెరిగినట్లు తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జూన్ 30, 2025 నాటికి అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ. 58,330.26 కోట్లు ఉన్నాయి. ఇక ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో రూ. 8,673.72 కోట్లుగా ఉన్నాయి. ఇక ప్రభుత్వ బ్యాంకుల అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ల విషయానికి వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 19,329.92 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 6,910.67 కోట్లు డిపాజిట్ చేసి ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదు.
కెనరా బ్యాంకులో రూ. 6,278.14 కోట్లు ఎవరూ తీసుకోని డిపాజిట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇక ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల విషయానికి వస్తే ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2063.45 కోట్లతో టాప్లో నిలిచింది. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ. 1609.56 కోట్లు, యాక్సిస్ బ్యాంకులో రూ. 1360.16 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.