బెంగుళూరులో అడుగుపెట్టిన ఛాంపియన్స్..ఆర్సీబీ ఆటగాళ్లకు ఘన స్వాగతం

 

ఐపీఎల్-2025 ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తమ హోం సిటీ బెంగళూరులో అడుగుపెట్టింది. వేలాది మంది అభిమానులు నడుమ ఆర్సీబీ ఆటగాళ్లు బస్సులో ర్యాలీగా వచ్చి చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్నారు.కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. మరోవైపు.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశముండటంతో పరేడ్‌ నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఓపెన్‌ బస్‌ పరేడ్ రద్దయింది. అయితే, సాయంత్రం 5 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎంట్రీ పాస్‌లు ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తారు.

18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ విజేతగా  నిలిచిన విషయం తెలిసిందే.నిన్న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ మైదానంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. దీంతో దేశ వ్యాప్తంగా ఆర్సీబీ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. అయితే.. ఈ విజయాన్ని ఫ్యాన్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఆర్సీబీ యాజమాన్యం నిర్ణయించింది. బెంగళూరులో విక్టరీ పరేడ్‌ నిర్వహిస్తున్నట్లు ఫ్రాంఛైజీ యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా జట్టు బెంగళూరు నగరానికి చేరుకుంది.