రాహుల్ ట్వీట్ పై దుమారం... ధైర్యం ఎలా వచ్చింది..
posted on Sep 2, 2016 3:27PM

మహాత్మాగాంధీ హత్య నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలకు గాను ఆల్ ఇండియా రేడియో ఓ ట్వీట్ చేసింది. అయితే ఇప్పుడా ట్వీట్ పెద్ద దుమారమే రేపుతుంది. ముందు ఆరెఎస్ఎస్ ను నేను అలా అనలేదు.. అని అన్న రాహుల్ గాంధీ.. ఆతరువాత ఆరెస్సెస్ వేసిన పరువు నష్టం దావాపై విచారణ ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అంతేకాదు.. కేసు కొట్టేయాలని సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ను కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా రేడియో ఓ ట్వీట్ చేసింది. అదేంటంటే...
‘రాహుల్ ముందు ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు కేసు విచారణ ఎదుర్కొనే ధైర్యం ఎలా వచ్చింది. రాహుల్ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలి’ అని ఆల్ఇండియా రేడియో ట్వీట్ చేసింది.

అంతే ఈ ట్వీట్ కు గాను కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఓ అధికారిక ప్రసార మాధ్యమం రాహుల్ గాంధీపై ఇలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, అది క్షమించరాని చర్య అని రణదీప్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఇలా చేయమని వెంకయ్యనాయుడు ఆదేశించారా అని అన్నారు. ఇక దీంతో వ్యవహారం కాస్త వేడిగా అవ్వడంతో ఆల్ ఇండియా రేడియో సంస్థ ట్వీట్ ను డిలీట్ చేసింది.