చైనా దురాక్రమణ పై లడాఖ్ ప్రజలు అలా.. మోడీ ఇలా.. రాహుల్ ఫైర్

భారత్ చైనా సరిహద్దులో గాల్వన్ లోయలో రెండు దేశాల మధ్య ఘర్షణ జరిగి రెండు వైపులా సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. ఐతే ఈ ఘర్షణ కు కారణం చైనా సైన్యం మన భూభాగంలోకి చొచ్చుకు రావడం వల్లే జరిగిందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. మరో పక్క ప్రధాని మోడీ మాత్రం చైనా సైన్యం మన భూభాగం లోకి రాలేదని చెప్పడం జరిగింది. ఐతే తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చైనా దురాక్రమణ విషయంలో మోడీ పై ఫైర్ అయ్యారు. ప్రధాని తన లేటెస్ట్ స్పీచ్ ల లో ఎక్కడ కూడా చైనా పేరెత్తకుండా మౌనం వహిస్తున్నారని అన్నారు. మోడీ ఎక్కడా చైనా అధ్యక్షుడు జింపింగ్ పై పల్లెత్తు మాట కూడా అనడం లేదని అసలు భారత పట్ల అయన నిబద్దత ను శంకించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తీవ్రంగా విమర్శించారు.

ఒకపక్క లడాఖ్ ప్రజలు తమ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందని చెపుతుంటే.. మరో పక్క ప్రధాని మాత్రం మన భూభాగం లోకి ఎవ్వరు రాలేదని అంటున్నారని ఐతే ఈ ఇద్దరి లో ఎవరో ఒకరు అబద్దం ఆడుతున్నారని అర్ధమౌతోందన్నారు. ఇదే సమయంలో దేశభక్తులైన లడాఖ్ ప్రజలు చైనాకు వ్యతిరేకంగా నినదిస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. దీనికి సాక్ష్యంగా అయన లడాఖ్ ప్రజలు చైనా వ్యతిరేక నినాదాలు చేస్తున్న వీడియోను షేర్ చేసారు. లడాఖ్ ప్రజల హెచ్చరికలు విస్మరిస్తే మన దేశానికీ తీవ్ర నష్టం జరుగుతుందని అయన తన ట్వీట్ లో హెచ్చరించారు. ఒక పక్క ప్రధాని మోడీ లడాఖ్ లోని సరిహద్దు ప్రాంతం లో ఉన్న సైనిక శిబిరాల వద్ద పర్యటన చేస్తున్న సమయంలో రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.