రెండేళ్ల బిడ్డతో బావిలో దూకి చనిపోయిన నిండు గర్భిణీ..
posted on Jun 26, 2021 11:02AM
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ నిండు గర్భిణి.. తన రెండేళ్ల బిడ్డతో కలిసి బావిలో దూకి నిండు ప్రాణం తీసుకుంది. లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన బోనెల రాజేశ్వరి (28)కి అదే గ్రామానికి చెందిన కోటేశ్వరరావుతో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి రెండేళ్ల పాప భువనేశ్వరి ఉంది. రాజేశ్వరి స్థానికంగా గ్రామ వాలంటీరుగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఏడునెలల గర్భిణి. భార్యాభర్తల గొడవల కారణంగా ఈనెల 23న పాపను తీసుకొని ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. అప్పటినుంచి కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం చిన్నమురపాక సమీపంలోని నేలబావిలో తల్లీ బిడ్డల మృతదేహాలు తేలడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆమె చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకుంది. ఆ తర్వాత తండ్రి, మేనమామలు అన్ని తామై ఏ లోటూ లేకుండా గారాభంగా పెంచి పెద్ద చేశారు. ఆమెకు నిచ్చిన అబ్బాయిని చూసి పెళ్లి చేశారు. పెళ్లి అవ్వగానే వాళ్ళ అమ్మాయికి పిల్లలు పుట్టాలి వాళ్ళు ఏతుకుని ఆడించాలని ఏ తండ్రి కలలుకనరు చెప్పండి. వాళ్ళు అనుకున్నట్లు గానే ఏడాది తిరగ్గానే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లిగా మారింది. అందరూ చనిపోయిన వాళ్ళ అమ్మే మళ్ళీ తన కడుపునా ముట్టిందని అనుకున్నారు. ఇక, ఆమె జీవితమంతా ఎత్తు పల్లాలు లేకుండా సాఫీగా సాగుతుందనికున్నారు. ఆమె బంధువులు కూడా మురిసిపోయారు. ఆ తరువాత ఊహించని రీతిలో ఆమె కాపురంలో కలతలు మొదలయ్యాయి. గొడవలు చిచ్చు రేగాయి. అప్పటికి ఆమె మళ్ళీ గర్భం దాల్చింది. నిత్యం నరకం అనుభవిస్తూ బాధనంతా తన బిడ్డతో పాటు కడుపులోనే దాచుకుంటూ వచ్చింది. చివరికి విసిగిపోయి ఆ నరకం కంటే మరణమే మార్గమనుకుంది. తాను నిండు గర్భిణి అని కూడా ఆలోచించలేదు.. రెండేళ్ల బిడ్డ అనాథ కాకూడదనుకుంది. తన బిడ్డతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం సమీప గ్రామాలకు తెలియడంతో కేశవరాయుపాలెం నుంచి కొందరు ఘటనా స్థలానికి చేరుకొని అవి రాజేశ్వరి, భువనేశ్వరి మృతదేహాలుగా గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కి తరలించారు. వీరిద్దరూ ఇంటి నుంచి బయలుదేరినరోజే చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేశ్వరి తమ్ముడు గన్నియ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు లావేరు పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే, అత్తింటి వేధింపులు తాళలేకే రాజేశ్వరి బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం తీసుకురావాలని అత్తమామలు వేధించేవారని, భర్త కోటేశ్వరరావు నిత్యం మద్యం తాగి వచ్చి తిడుతూ కొట్టేవాడని రాజేశ్వరి తమ్ముడు గన్నియ్య, తండ్రి సూర్యనారాయణ పోలీసులకు తెలిపారు. ఇంట్లో నరకం చూపిస్తున్నారంటూ రాజేశ్వరి తరుచూ తమకు చెప్పుకుని బాధపడేదని వాపోయారు. తన సోదరి వెళ్లిపోయినప్పటి నుంచి లావేరు పోలీసుస్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పట్టించుకోలేదని గన్నియ్య ఆరోపిస్తున్నారు. రాజేశ్వరికి సీమంతం చేసి తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు పుట్టింటివారు ఈనెల 30న ముహూర్తం నిర్ణయించారు. ఇంతలోనే దారుణం జరగడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామంలో అందరితో సరదాగా ఉండే రాజేశ్వరి ఆత్మహత్య చేసుకోవడంతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.