షర్మిలపై విషప్రచారం దారుణం: ప్రభాస్

 

వైసీపీ నాయకురాలు షర్మిలపై, తనపై కొన్నాళ్లుగా జరుగుతున్న విషప్రచారాన్ని కథానాయకుడు ప్రభాస్ ఖండించారు. షర్మిలను తానెప్పుడూ కలవడం కానీ, మాట్లాడడం కానీ జరగలేదని ప్రకటించారు. ‘‘ప్రచారంలో ఉన్న గాలి వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. వాటిలో వీసమెత్తయినా నిజం లేదు’’ అని ప్రభాస్ తాను చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో తన ఆరోగ్యం గురించి కూడా పుకార్లు వచ్చాయని ఈ సందర్భంగా ప్రభాస్ తెలిపారు. తాను తీవ్రంగా గాయపడ్డానని, కోమాలో వున్నానని.. ఇలా పుకార్లను సృష్టించారని, ఆ పుకార్ల వల్ల తన కుటుంబం ఎంతో బాధపడిందని, అయినా తాను వాటిని తాను ఉపేక్షించానని, అయితే నాతో పాటు మరో వ్యక్తి గౌరవానికి కూడా భంగం కలిగించేలా విషప్రచారం సాగుతున్నప్పుడు నేను వాటిని ఉపేక్షించకూడదు. అందుకే ఆ దుష్ర్పచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని ప్రభాస్ తన ప్రకటనలో వివరించారు. ‘‘పెళ్లి చేసుకుని, పిల్లలు కూడా ఉన్న అత్యంత గౌరవనీయురాలైన ఓ మహిళ గురించి ఇంత అమానవీయంగా, అగౌరవకరమైన రీతిలో, ఆమె గౌరవమర్యాదలను దెబ్బ తీసే రీతిలో పుకార్లను ప్రచారం చేయడం శోచనీయం. నాకు రాజకీయ ఆసక్తులేవీ లేవని మీ అందరికీ తెలుసు. ఈ ప్రచారం వ్యక్తిగతంగా హృదయాన్ని తీవ్రంగా బాధించడంతో ఈ ప్రకటన చేస్తున్నాను’’ అని తెలిపారు. ‘‘ఈ రకమైన నిరాధారమైన గాలి వార్తల వల్ల ఒక వ్యక్తి ఎంతటి బాధకు గురవుతారో, మానసిక క్షోభను అనుభవిస్తారో నేను అర్థం చేసుకోగలను. అందుకే ఈ దుష్ర్పచారానికి పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టడానికి సిద్ధమయ్యాను’’ అని ప్రభాస్ పేర్కొన్నారు. ‘‘ఇలాంటి వదంతుల వల్ల సంబంధిత వ్యక్తుల గౌరవమర్యాదలకు తీరని నష్టం వాటిల్లుతుంది గనుక ఈ పుకార్లను సృష్టించిన, వాటిని ప్రచారంలో పెట్టడానికి బాధ్యులైన వారిపై పోలీసులు, సంబంధిత అధికారులు తగిన చర్య తీసుకుంటారని భావిస్తున్నాను’’ అని ప్రభాస్ ప్రకటించారు.