విద్యుత్.. దశ తిరిగింది!
posted on Jan 30, 2012 8:39AM
హైద
రాబాద్: విద్యుత్ రంగానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో విద్యుత్ రంగానికి 2.93 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడుల ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేలా ఏపి ట్రాన్స్కో, జెన్కోలు ఇంధనశాఖ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసేందుకు కసరత్తు ప్రారంభించాయి. ఇటీవల సిఐఐ, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భాగస్వామ్య సదస్సుకు 6.47 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో 2.93 లక్షల కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ రంగానికి వచ్చాయి. ఈమేరకు ఎంఒయులు కూడా కుదిరాయి. గ్యాస్, థర్మల్, జల, పవన, సౌర విద్యుత్ రంగాల్లో ప్రాజెక్టులను నిర్మించేందుకు వివిధ కంపెనీలు క్యూ కట్టాయి. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. అలాగే కేంద్ర, రాష్ట్రప్రభుత్వ రంగ సంస్థలు కూడా విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు చురుకుగా కదలడం విశేషం.
గ్యాస్ ఆధారిత విద్యుత్ రంగాన్ని విశే్లషిస్తే ప్రభుత్వ రంగంలో రెండు ప్రాజెక్టులను 14,664 కోట్ల రూపాయలతో నెలకొల్పేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. ప్రైవేట్ రంగంలో 15 ప్రాజెక్టులను నెలకొల్పేందుకు 35,620 కోట్ల రూపాయల పెట్టుబడులతో సంస్థలు రానున్నాయి. ఇవన్నీ సాకారమైతే 5720 మందికి ఉద్యోగాలు వస్తాయి. 10,348 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. థర్మల్ విద్యుత్ రంగాన్ని పరిశీలిస్తే ఆరు ప్రాజెక్టులను 38,470 కోట్ల రూపాయలతో నెలకొల్పేందుకు ప్రభుత్వం, 1,13,258 కోట్ల రూపాయల పెట్టుబడులతో 12 సంస్థలు ముందుకువచ్చాయి. దీనివల్ల 28,080 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. 26,120 మందికి ఉపాధి లభిస్తుంది. జల విద్యుత్ రంగంలో 960 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు 3722 కోట్ల రూపాయల పెట్టుబడితో జెన్కో ముందుకు వచ్చింది. దీనివల్ల 576 మందికి ఉపాధి లభిస్తుంది. పవన విద్యుత్ రంగంలో 41 సంస్థలు 71,232 కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రాజెక్టులను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీనివల్ల 14,243 మందికి ఉపాధి లభిస్తుంది. సౌర విద్యుత్ రంగంలో 4200 కోట్ల రూపాయలతో 350 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు నాలుగు సంస్థలు పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. దీనివల్ల 8224 మందికి ఉపాధి లభించనుంది. మొత్తంమీద రాష్ట్రంలో 53,984 మెగావాట్ల విద్యుదుత్పాదనకు 2,81,166కోట్ల రూపాయల పెట్టుబడులతో 81 ప్రాజెక్టులు ముందుకు వచ్చాయి. విద్యుత్ రంగంలో రానున్న రోజుల్లో మొత్తం 50వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి దినేష్కుమార్ తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను ఎదుర్కొనేందుకు జనవరి నుంచి మే వరకు విద్యుత్ కొనుగోలుకు ట్రాన్స్కో ప్రణాళిక ఆమోదించింది.