జగన్ అరెస్టుకు డిమాండ్..కెవిపి'సాక్షి'కాదు:గాలి

హైదరాబాద్: ఎమ్మార్ కుంభకోణంలోని సొమ్ము కెవిపి రామచందర్ రావు ఇంటికి చేరిందని, అక్కడి నుంచే సునీల్ రెడ్డి తీసుకుని వెళ్లి జగన్‌కు అందజేశారని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు మీడియా ప్రతినిధుల సమావేశంలో  ఆరోపించారు. డబ్బు వసూలు చేసిన కెవిపిని, అక్రమ సొమ్మును సొంతం చేసుకున్న జగన్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని,వారిని  వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేసారు.. ఎమ్మార్ కేసులో కెవిపి సాక్షి కాదని, ప్రథమ ముద్దాయి అని ఆయన  వ్యాఖ్యానించారు. ఎమ్మార్‌లో కెవిపికి బినామీ పేర్లతో 18 ప్టాట్లు, బెంగళూర్, చెన్నైలకు చెందిన తప్పుడు చిరునామాలతో మరో 50-60 ప్లాట్లు ఉన్నాయని ఆయన అన్నారు.

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కుంభకోణం కేసులో జగన్‌తో పాటు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తదితరులు కూడా దోషులేనని, వారిపై విచారణ జరపాలని ఆయన అన్నారు. సబితా ఇంద్రా రెడ్డిని మంత్రి వర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను అరెస్టయ్యాక జగన్ సోనియాకు వాటాలందిన విషయాన్ని బయటపెడతారని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు జగన్‌కు సహకరిస్తున్నారని, అందుకే జగన్‌ను, సజ్జల దివాకర్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడం లేదని ఆయన విమర్శించారు.