పోలీసులు ఇలా.. సీబీఐ అలా..! ..ఏపీలోనే ఎందుకిలా?
posted on May 24, 2023 2:09PM
చిన్న పాటి నిరసన సైతం జరిగే అవకాశం ఇవ్వకుండా ఏపీ పోలీసులు ప్రజలను ఆంక్షల పేరుతో అడుగు బయటపెట్టనీయకుండా ఆపేస్తున్నారు..ఒక వేళ ఎవరైనా ధర్మాగ్రహం ప్రదర్శిస్తే.. కేసులు, జైళ్లు అంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు అన్న తేడా కూడా లేకుండా లాఠీలకు పని చెబుతున్నారు.
తాజాగా గుంటూరు జిల్లా తాళ్లూరులో కూడా పోలీసులు తమ విశ్వరూపం చూపారు. ఆర్5 జోన్ కు వ్యతిరేకంగా నిరసన దీక్షకు దిగిన తెలుగుదేశం శ్రేణులను, అమరావతి రైతులను అనుమతి లేదంటూ విచక్షణా రహితంగా కొట్టారు. తుళ్లూరు దీక్షా శిబిరాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. రైతులు నిరసన దీక్షా శిబిరం వద్ద వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ.. రైతులను పోలీసులు అరెస్టు చేశారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా పోలీసులు లాగి పడేశారు. అ రైతులు, మహిళలను బలవంతంగా వాహనాలు ఎక్కించి తుళ్లూరు పీఎస్కు తరలించారు.
అదే సమయంలో ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా నాలుగు రోజులుగా కర్నూలులో వైసీపీ శ్రేణులు, అవినాష్ మద్దతుదారులు విశ్వభారతి ఆస్పత్రి వద్ద బైఠాయించి ఆ దారిలో రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నా, ఆస్పత్రిలో రోగులకు ఇబ్బందులు ఎదురౌతున్నా కర్నూలు పోలీసులు చోద్యం చూస్తున్నారు. పైపెచ్చు ఆస్పత్రిలో తలదాచుకున్న అవినాష్ కు సీబీఐ నుంచి రక్షణ కవచంలా నిలబడ్డారు.
ఒక వైపు ఏపీ పోలీసులు సామాన్యుల విషయంలో నిబంధనలను పట్టించుకోకుండా లాఠీలతో, కేసులతో అరెస్టులతో బీభత్సం సృష్టిస్తుంటే.. మరో వైపు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తన ప్రతిష్ట మంట కలిసే విధంగా నత్తతో పోటీ పడుతూ అడుగులు వేస్తోంది. తమ నోటీసులను ధిక్కరించి, అనుచరులను అడ్డంగా పెట్టుకుని ఆస్పత్రిలో తలదాచుకున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి నీడను కూడా తాకలేని నిస్సహాయత ప్రదర్శిస్తోంది.
ఇంత నిస్సహాయత వ్యక్తం చేస్తున్న సీబీఐ కేసులు ఎలా దర్యాప్తు చేస్తోందా అన్న అన్న అనుమానాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో సీబీఐ పప్పులు ఉడకవా అని ప్రశ్నిస్తున్నారు. జగన్మాయ సీబీఐని కమ్మేసిందా అన్న అనుమానాలను సామాన్యజనం సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.