పవన్ ఆలయాల సందర్శన షురూ!.. వెంట తనయుడు అకీరా కూడా
posted on Feb 12, 2025 1:53PM

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా కరళ, తమిళనాడులలోని పలు ఆలయాలను సందర్శించనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బుధవారం (ఫిబ్రవరి 12) కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కల్యాణ్ వెంట ఆయన కుమారుడు అకీరా నందన్ , టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్సాయి ఉన్నారు. అనంతరం తిరువనంతపురంలోని పరశురామస్వామి ఆలయాన్ని పవన్ సందర్శించారు. నాలుగు రోజుల ఈ పర్యటనలో ఆయన అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరస రామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
సనాతనధర్మ పరిరక్షణ కోసమంటూ పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయాల సందర్శన వెనుక భారీ వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పవన్ కల్యాణ్ బీజేపీ ఎజెండాను అందిపుచ్చుకుని సనాతన ధర్మ పరిరక్షణ, హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించేందుకే ఈ పర్యటన చేపట్టారని అంటున్నారు.