పోలీసుల చక్రబంధనంలో పట్టాభి.. కఠిన ఆంక్షలతో కట్టడి..
posted on Oct 21, 2021 11:15AM
టీడీపీ నేత పట్టాభిని అరాచకంగా అరెస్ట్ చేశారు. రాత్రి వేళలో పోలీసుల గుంపు పట్టాభి ఇంటిపై దాడి చేశారు. కాలింగ్ బెల్ కొడితే డోర్ తీయలేదనే కారణంతో.. ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోనికి చొచ్చుకెళ్లారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండంటూ పట్టాభి భార్య డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. ఈ పరిణామాన్ని ముందే ఊహించిన పట్టాభి.. సెల్ఫీ వీడియోతో విషయం బయటపెట్టారు. తన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని.. పోలీస్ కస్టడీలో రఘురామను కొట్టినట్టు తనను కొట్టే అవకాశం ఉందంటూ.. తన శరీర భాగాలన్నిటినీ వీడియోలో చూపించారు. ఎట్టకేళకు పట్టాభిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు.
టీడీపీ నేత పట్టాభిని తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. గురువారం కోర్టులో హాజరుపరచనున్నారు. పట్టాభి అరెస్ట్ నేపథ్యంలో తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఊళ్లోకి వెళ్లే రోడ్లను మూసివేశారు. స్థానికులకు తప్ప ఇతరులకు గ్రామంలోకి అనుమతించడం లేదు పోలీసులు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ రోడ్డులో పచ్చగడ్డి మోపులతో వెళ్తున్న రైతులను కూడా అడ్డుకుంటున్నారు. పట్టాభి కోసం టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరాకుండా కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు.