పాక్ లోయధేచ్చగా తిరుగుతున్న పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి!
posted on May 30, 2025 2:51PM

అది పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్. అక్కడ పీఎంఎంఎల్ అంటే పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ అనే ఒక రాజకీయ పార్టీ ర్యాలీ నిర్వహిస్తే అందులో ఒకడు కనిపించాడు. ఈ మధ్య అంటే, మే 28న అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేసింది ఐక్య రాజ్యసమితి. అందుకు అతడన్న మాట నేనిపుడు వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాను అని. ఇంతకీ అతడు చేసిన ఘనకార్యం ఏంటని చూస్తే పహెల్గాం దాడి ద్వారా 26 మంది భారతీయుల ప్రాణాలు పోయేలా చేయడం. (వీరిలో అత్యధికులు హిందు పురుషులు) అతడి పేరు సైఫుల్లా కసూరి.
ఇతడి వ్యూహరచన కారణంగా భారత్- పాక్ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చి.. భారీ ఎత్తున ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది. అకారణంగా కొందరు చనిపోయారు. ఒక సమయంలో కిరానా కొండల్లోని పాక్ అణు నిల్వలు కానీ లీక్ అయి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేది. పాకిస్థానే ప్రపంచ చిత్రపటంలో లేకుండా పోయేది.. కానీ ఇతడికి కించత్ కూడా జాలి- దయా- కరుణ లేకుండా విచ్చలవిడిగా పాకిస్తాన్ బాహ్య ప్రదేశాల్లో తిరుగుతూ.. కాలర్ ఎగరేస్తున్నాడు. ఇదే ర్యాలీలో లష్కరే తోయిబా చీఫ్ కొడుకు తల్హా సయీద్, మరో యూఎన్ ఉగ్రవాది అమీర్ హంజా కూడా పాల్గొన్నారు.
తల్హా సయీద్ అయితే పీఎంఎంఎల్ ద్వారా లాహోర్ నుంచి పార్లమెంటుకు పోటీ చేసి.. రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని విఫలయత్నం చేశాడు. ఎందుకనో అది సాధ్యం కాలేదు. ఇతడు భారత్ కి కావల్సిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో 32వ వాడు. ఇతడు ఈ ర్యాలీ ద్వారా తన తండ్రి హఫీజ్ సయిద్ ని విడిపించాలని డిమాండ్ చేశాడు, భారత్ సింధూ జలాల ఒప్పందం రద్దును పునః సమీక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ ఉగ్ర సంస్థకు చిన్నపాటి సైన్యం, విశ్వ విద్యాలయం, రాజకీయ పార్టీ ఉన్నాయి. వీటి ద్వారా వీరు భారత్ వ్యతిరేకత నూరి పోసి.. పాక్ ప్రజలను ఆకర్షించి.. పాక్ పార్లమెంటులో అడుగు పెట్టి తద్వారా పాకిస్థాన్ని ఏలాలన్నది వీరి ఆలోచనగా తెలుస్తోంది. ఈ ఉగ్రమూకల కారణంగా పాకిస్తాన్ నీటి కటకటను ఎదుర్కుంటోంది.
మొన్న నీటి కొరత కారణంగా సింధ్ ప్రజలు తమ హోం మంత్రి ఇంటిని తగలబెట్టారు. తాజాగా పాక్ నటి హీనా బయత్ కరాచీ వంటి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో నీళ్లు రావడం లేదని ఇన్ స్టా పోస్టు పెట్టింది. దీనంతటికీ కారణం ఎవరు? యధేచ్చగా తిరుగుతున్న ఈ లష్కరే, జైషే ఉగ్రవాదులు కారా?
అదేంటో మన భారతదేశంలో సోషల్ మీడియా గ్రూపులైన ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సప్, టెలిగ్రామ్ లో ఒక చిన్న షేర్ కొట్టినందుకే మనకు వార్నింగులు ఇస్తాయి. అదే పాకిస్తాన్ లో ఈ ప్లాట్స్ ఫామ్స్ మీద నుంచి జైషే అనే ఉగ్ర సంస్థ ఏకంగా ఉగ్రవాద ప్రచారం నిర్వహిస్తోంది. విరాళాలు కావాలంటూ అభ్యర్ధనలు చేస్తోంది. కొత్త రక్తం ఎక్కించడానికి పాక్ యువతకు వల వేస్తోంది. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వేదికగా.. పెద్ద పెద్ద ఉగ్రవాద చానెళ్లను నడిపేస్తోంది.
ఇక్కడ ఉగ్రవాదం ఎంత బహిర్గతమో చెప్పేలా ఏకంగా బాహావల్పూర్ వీధుల్లో ఆగస్ట్ 25న జిహాదీ కవిత్వం వినడానికి రమ్మంటూ ఆహ్వాన పత్రికలతో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీల్లో మొన్న భారత్ దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదుల చిత్రపటాలు వేసి మరీ మసూద్ అజర్ పేరిట పోస్టర్లు వేసి మరీ పిలుస్తున్నారు.
ఇదే మసూద్ అజర్ కి 14 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది పాకిస్థాన్. ఇతడు ఎంతటి భారత వ్యతిరేక ఉగ్రవాదో చెప్పనలవి కాదు. మన భారత భూభాగానికి అనేక సార్లు రక్తపు మరకలు అంటించిన ఉగ్రవాది. అలాంటి వాడికి నిధులిస్తూ ఆ దేశ ప్రధాని హెహబాజ్ షరీఫ్ భారత్ తో శాంతి చర్చలకు తాము సిద్ధమేనని పిలుపునిస్తాడు. ఇలాంటి పాకిస్థాన్ కి ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకులు సుమారు 25 బిలియన్ డాలర్లు ఇస్తోంది. మరి ఇదే అంతర్జాతీయ సంస్థ అయిన ఐక్యరాజ్యసమితి కసూరీ వంటి వారిని ఉగ్రవాద ముద్ర వేయడమేంటి? ఇలాంటి వాళ్లకు పాకిస్థాన్ తనకొచ్చే ఐఎంఎఫ్ ఇతర నిధుల నుంచి కొంత మొత్తం కేటాయించి వారిని ఎంకరేజ్ చేయడమేంటి?
ఉగ్రవాదులు తమ దేశంలో ఇంత బాహటంగా తిరుగుతుంటే.. భారత్ తో శాంతి చర్చలకు ఈ దేశం మళ్లి మళ్లీ పిలవడమేంటి??? ఈ యుద్ధం ఇక్కడితో ముగియలేదు. దీనికి ఎక్కడో ఒక చోట భారత్ ఫుల్ స్టాప్ పెట్టి తీరాల్సిందే. ఈ దిశగా అంతర్జాతీయ వేదికలపై పాక్ పీచమణచాల్సిందే. తాజాగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ పీవోజేకే(పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్) వారే తిరిగి భారత్ లో కలుస్తామని అడగటానికి ఎన్నో రోజులు లేవని అంటున్నారు. ఈ దిశగా భారత్ పాకిస్థాన్ నుంచి పీవోజేకేని లాగేసుకోవడంతో పాటు బలూచిస్తాన్ కి కూడా సపోర్టు చేయాలి. ఇలా పాక్ ఎకో సిస్టమ్ ని దారుణంగా దెబ్బ తీసి ఆ దేశంలో ఉగ్రవాదం అనడానికే ఒణికి చావాలి. భారత్ పై ఈ సారి దాడి చేయడానికే సాహసించే యత్నం చేయకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరుకుందాం. జైహింద్!