కేసీఆర్ని కలవాలని చాలా ప్రయత్నించాను..కలవలేకపోయాను : ఎమ్మెల్సీ కవిత
posted on May 30, 2025 2:55PM

పెద్దపల్లి జిల్లా మంచిర్యాల పర్యటనలో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు సొంత అజెండా ఏమీ లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దన్నదే నా వాదన అని ఆమె అన్నారు. కమలం పార్టీతో పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని కలవాలని చాలా ప్రయత్నించాను కలిసే అవకాశం వచ్చింది.. కానీ, కలవలేకపోయాను అని ఆమె అన్నారు. తాను రాసిన లేఖ ఎలా బహిర్గతమైందో, దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. "నాకంటూ ప్రత్యేక జెండా గానీ, అజెండా గానీ లేవు. బీఆర్ఎస్ నా పార్టీ, కేసీఆరే నా నాయకుడు" అని కవిత మరోసారి తేల్చిచెప్పారు. పార్టీని కాపాడుకోవడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరెవరి నాయకత్వాన్ని తాను అంగీకరించే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు.
బీజేపీతో పొత్తుల అంశంపైనా కవిత ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వైపు చూడకూడదని... బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామంటే అస్సలు ఒప్పుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు. గులాబీ పార్టీలో నెలకొన్న సమస్యలు, పుట్టుకొస్తున్న కోవర్టుల గురించే తాను కేసీఆర్కు లేఖ రాశానని, ఇందులో తప్పేముందని ఆమె ప్రశ్నించారు. ముందు నా మీద దృష్టి తగ్గించి, ముందు ఆఉత్తరాన్ని లీక్ చేసిన వారిని పట్టుకోండి అని పార్టీ అధిష్ఠానానికి ఆమె హితవు పలికారు. ఆపరేషన్ కగార్ను ఆపాలని కోరిన బీజేపీ ప్రభుత్వం మారణకాండ కొనసాగించిందని కవిత అన్నారు. అంతిమ సంస్కారాల కోసం మవోయిస్టు నంబాల మృతదేహాన్ని కుటుంబానికి ఇవ్వాలన్న కనీస సంస్కారం లేని పార్టీ బీజేపీ అని ఆమె ధ్వజమెత్తారు.