అమెజాన్ ప్రైమ్ యూజర్లకు షాకింగ్ న్యూస్..ఎందుకంటే?

 

ప్రముఖ  ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ తన వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. జూన్ 17నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసార‌మ‌య్యే సినిమాలు, టీవీ షోల మధ్యలో యాడ్స్‌ను ప్రసారం చేయనున్నట్లు అమెజాన్ వెల్ల‌డించింది. ఒకవేళ ఎలాంటి యాడ్స్ వద్దు అనుకుంటే వారు అదనంగా ఏడాదికి రూ. 699 లేదా నెలకు రూ.129 చెల్లించాలని పేర్కొంది. 

కాగా  ప్రైమ్ మెంబర్షిప్ కోసం ఇప్పటికే ఏడాదికి రూ.1499 చెల్లిస్తున్నారు. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో కంటెంట్‌పై మరింత పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేర‌కు అమెజాన్ త‌న వినియోగదారులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడం ప్రారంభించింది. "ఇది మేము ఆకర్షణీయమైన కంటెంట్‌లో పెట్టుబడి పెట్టడం కొనసాగించడానికి, ఆ పెట్టుబడిని ఎక్కువ కాలం పాటు పెంచుకోవడానికి అనుమతిస్తుంది. టీవీ ఛానెళ్లు, ఇతర స్ట్రీమింగ్ సేవల కంటే అర్థవంతంగా తక్కువ ప్రకటనలను కలిగి ఉండాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం" అని సందేశాలు పంపుతోంది.