ఇకపై ‘ఎన్టీఆర్ జలప్రభ’
posted on Apr 30, 2015 7:40PM

ఇప్పటి వరకు ఇందిర జలప్రభ పేరుతో అమల్లో వున్న పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరు మార్చింది. ఈ పథకాన్ని ఇకపై ‘ఎన్టీఆర్ జలప్రభ’ పేరుతో పిలుస్తారు. ఈ మేరకు గురువారం నాడు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం పట్ల ఏపీ ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన ఎన్టీఆర్ పేరును ఈ పథకానికి పెట్టడం సముచితమని ప్రజలు, రైతులు అంటున్నారు. ఇదిలా వుండగా, ఒంటిమిట్టలోని రామాలయాన్ని తిరుపతి తిరుమల దేవస్థానానికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమిని కడప జిల్లా ఒంటిమిట్టలో అధికారంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒంటిమిట్ట దేవాలయాన్ని అప్పగించడం వల్ల ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందే అవకాశం వుంది.