సౌతాఫ్రికాలో చిన్నారులకు వైరస్.. ఒమిక్రాన్ పంజా విసురుతోందా?
posted on Dec 5, 2021 9:19AM
ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ కు సంబంధించిన భయంకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒమిక్రాన్ 38 దేశాలకు వ్యాపించిందని.. ఎవరూ చనిపోలేదని డబ్ల్యూహెచ్వో తెలిపింది.
ఒమిక్రాన్ తొలి కేసు నమోదైన సౌతాఫ్రికాలో వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. వారం రోజుల్లోనే కేసుల సంఖ్య మూడింతలు అయ్యింది. ఒమైక్రాన్ వెలుగుచూశాక.. దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం 16,055 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఇందులో 800 కేసులు ఒమైక్రాన్ జన్మస్థానం గౌటెంగ్ ప్రావిన్సువేలోనే నమోదయ్యాయి. అయితే, కొత్త కేసుల్లో ఐదేళ్లలోపు పిల్లలు అధికంగా ఉండడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘
‘ఒకటో, రెండో వేవ్లో పిల్లలు పెద్దగా కొవిడ్కు గురికాలేదు. ఆస్పత్రుల పాలవలేదు. మూడో వేవ్లో ఐదేళ్లలోపు పిల్లలతో పాటు 15-19 ఏళ్ల మధ్య వయసు వారు కరోనాతో ఆస్పత్రుల్లో చేరారు. అయితే, ఇప్పుడు నాలుగో వేవ్లో ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు భారీగా ఆస్పత్రుల్లో చేరుతున్నారు. మేం అంచనా వేసిన దానికంటే ఇది తక్కువే. అయితే, 60 ఏళ్లు దాటిన రోగుల తర్వాత ఐదేళ్లలోపు పిల్లల చేరికే ఎక్కువగా ఉంది’’ అని దక్షిణాఫ్రికాకు చెందిన డాక్టర్ వాసిలా జస్సాత్ తెలిపారు. నాలుగో వేవ్ ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉండడంపై మరింత పరిశీలన అవసరమని మరో నిపుణుడు డాక్టర్ మైకేల్ గ్రూమ్ పేర్కొన్నారు.
ఇక మన దేశంలో మరో రెండు ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్లోని జామ్నగర్కు చెందిన వృద్ధుడి(72)కి, మహారాష్ట్రలోని ముంబై శివారు కల్యాణ్ డోంబివ్లి వాసి, మెరైన్ ఇంజనీర్ అయిన యువకుడి (33)కి కొత్త వేరియంట్ నిర్ధారణ అయింది. దీంతో దేశంలో ఈ వేరియంట్ బారినపడిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. జామ్నగర్ వృద్ధుడు కొన్నేళ్ల నుంచి జింబాబ్వేలో ఉంటున్నారు. బంధువులను కలిసేందుకు నవంబరు 28న భారత్ వచ్చారు. జ్వరంగా ఉండడంతో పరీక్ష చేయించుకున్నారు. గురువారం పాజిటివ్ అని తేలింది. జన్యు విశ్లేషణ ఫలితాల్లో ఒమిక్రాన్ ఉన్నట్లు స్పష్టమైంది. ముంబై యువకుడు దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్ మీదుగా గత నెల 23న ఢిల్లీ వచ్చాడు. టెస్టులకు నమూనా ఇచ్చి, ముంబై చేరుకున్నాడు. తాజాగా ఇతడికీ ఒమిక్రాన్ నిర్ధారణ అయింది.
మరోవైప ుముప్పు జాబితాలోని దేశాల నుంచి వచ్చినవారు కొవిడ్ టెస్టులను తప్పించుకుంటుండటం అధికారులకు తలనొప్పిగా మారుతోంది. యూపీలోని మేరఠ్కు విదేశాల నుంచి వచ్చిన 300 మందిలో 13 మంది తప్పుడు చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇచ్చారు. వీరిలో ఏడుగురు దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఓ మహిళపై కేసు నమోదు చేశారు. మరోవైపు బెంగళూరులో ఇప్పటికీ 10 మంది ఆచూకీ తెలియడం లేదు. రోజువారీ కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల, మరణాల రేటు ఎక్కువగా ఉంటుండడంతో కేంద్ర ప్రభుత్వం శనివారం తమిళనాడు, కేరళ, కర్ణాటక, మిజోరం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శనివారం ఆయా రాష్ట్రాలకు లేఖ రాశారు. ముప్పు జాబితాలోని దేశాల నుంచి వచ్చేవారిపై పర్యవేక్షణ పెంచాలని, పెద్దఎత్తున కేసులు వస్తున్న ప్రాంతాల్లోని నమూనాలను జన్యు విశ్లేషణకు పంపాలని సూచించారు.
గత వారం కశ్మీర్లోని కథువా జిల్లాలో కేసులు 727 శాతం, కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో 152 శాతం, తమిళనాడులోని మూడు జిల్లాల్లోనూ కేసులు పెరగడాన్ని ఆయన ప్రస్తావించారు. కేరళలో మరణాలు అధికంగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఒక డోసు టీకా కూడా వేయించుకోని వారికి హోటళ్లు, మార్కెట్లలోకి ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తూ తమిళనాడు మదురై కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఈ నగరంలో 3 లక్షల మంది ఇంకా తొలి డోసు కూడా పొందలేదు.