ఉగ్రవాదులుగా పొరబడి పౌరులపై జవాన్లు కాల్పులు.. 14 మంది మృతి! నాగాలాండ్ లో ఘోరం..

ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌ లో ఘోరం జరిగింది. ఉగ్రవాదులు అనుకొని సాధారణ పౌరులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 14 మంది పౌరులు చనిపోయారని తెలుస్తోంది.మృతుల సంఖ్యపై కొంత గందరగోళం నెలకొంది. ఆరుగురు చనిపోయారని అధికారులు చెబుతుంటే.. మొత్తం 14 మందిని చంపేశారని స్థానికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని తెలుస్తోంది.

మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో చాలా మంది బొగ్గు గనుల్లో పనిచేస్తున్నారని, నిన్న సాయంత్రం పనులు ముగించుకొని ఇళ్లకు వస్తున్న సమయంలో భద్రతాదళాలు కాల్పులు జరిపారని స్థానికులు తెలిపారు. వారికి ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని వాపోయారు. తప్పుడు సమాచారంతో వారిని చంపేశారని విలపిస్తున్నారు.  

కాల్పుల తర్వాత గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు హింసకు పాల్పడ్డారు.NSCN మిలిటెంట్లుగా పొరపాటుపడి అమాయక యువకులను పొట్టన పెట్టుకున్నారని ఆందోళనకు దిగారు.  భద్రతా సిబ్బందికి చెందిన పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు మరోసారి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఆ కాల్పుల్లో మరికొందరికి గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో టిరు గ్రామం నివురు గప్పిన నిప్పులా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది.

జవాన్లు కాల్పుల ఘటనపై నాగాలాండ్ సీఎం నైపూ రియో స్పందించారు. ఇది దురదృష్టకర ఘటన అని అన్నారు. అమాయక పౌరులను చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాల్పులపై అత్యుతన్నత స్థాయి సిట్ దర్యాప్తు చేస్తుందని.. బాధితులకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు నాగాలాండ్ సీఎం. దయచేసి ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.