ఎపికి తుఫాను గండం తప్పినట్టే
posted on Nov 17, 2023 3:39PM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి మిధిలీ అని నామకరణం చేశారు. మాల్దీవులు సూచించిన మేరకు ఈ పేరు పెట్టారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఈ తుపాను ఒడిశాలోని పరదీప్ కు దక్షిణ ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఏమాత్రం ఉండబోదని ఐఎండీ తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ల వైపు మళ్లడంతో రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పినట్టయింది. అయితే రానున్న రెండు రోజులు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరో ద్రోణి కొనసాగుతోంది. దీని ఫలితంగా రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని, జల్లులు గాని కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.గంటకు 20 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఈ తుపాను రేపు (నవంబరు 18) తెల్లవారుజామున బంగ్లాదేశ్ తీరంలోని ఖెపుపారా వద్ద తీరం దాటనుంది. ఇది భూభాగంపైకి ప్రవేశించే సమయంలో బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో గంటకు 80 కి.మీ పైగా వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.