ఏపీలో వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ
posted on Jul 6, 2025 5:36PM

ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్యూఆర్ కోడ్తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కోటిన్నర అగ్రిలో పంపిణీ చేయనుంది. నేతల ఫోటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్దిదారు ఫోటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల రేషన్ కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది..బ్యాంకు ఏటీఎం కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో ఈ స్మార్ట్ రేషన్ కార్డును రూపొందిస్తున్నారు. ఈ కార్డుల జారీకి పౌరసరఫరాల శాఖ ఇప్పటికే కసరత్తును పూర్తి చేసింది.
స్మార్ట్ రేషన్ కార్డుపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కార్డుదారు (కుటుంబ పెద్ద) ఫోటో ఉంటాయి. ఆ రేషన్ కార్డు నంబరు, రేషన్షాపు నంబరు తదితర వివరాలుంటాయి. కార్డు వెనుకవైపు లబ్ధిదారు కుటుంబ సభ్యుల వివరాలుంటాయి. ఈ స్మార్ట్ రేషన్ కార్డును రేషన్ డీలర్ల వద్ద ఉండే ఈ-పోస్ యంత్రాల సహాయంతో స్కాన్ చేస్తే ఆ ఫ్యామిలీ సంబంధించిన వివరాలతోపాటు రేషన్ సరుకుల వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రత్యక్షమవుతుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ కోసం ఏపీటీఎస్ ద్వారా టెండరు ప్రక్రియ పూర్తి చేశారు. ప్రస్తుతం ముద్రణ దశలో ఉన్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను వచ్చే నెలలో పంపిణీ చేసేందుకు పౌరసరఫరాలశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు