జగన్ గారి ఏడాది పాలన.. కోర్టు మొట్టికాయలు, భూకబ్జాలు, మంత్రుల బూతులు

వైఎస్ జగన్ ఏడాది పాలనపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. జగన్ ఏడాది పాలన కోర్టు మొట్టికాయలు, భూకబ్జాలు, స్కాములు, మంత్రుల బూతులు, దౌర్జన్యాలు అంటూ విరుచుకుపడ్డారు.

"వైఎస్ జగన్ గారి ఏడాది పాలన గురించి చెప్పాలంటే 65 కోర్టు మొట్టికాయలు, రాజ్యాంగ అతిక్రమణలు,కోర్టు ధిక్కారాలు, జాతీయ స్థాయిలో తుగ్లక్ ప్రభుత్వం,తీవ్రవాద ప్రభుత్వం అంటూ వచ్చిన బిరుదులు,భూకబ్జాలు, స్కాములు, మంత్రుల బూతులు,భజనలు,దౌర్జన్యాలు అని చెప్పుకోవాలి." అని విమర్శించారు.

"ఇక ప్రజల బాగు విషయానికి వస్తే 60 మంది నిర్మాణరంగ  కార్మికులు, 65 మంది రాజధాని రైతులు, 750 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు.160 రోజులుగా అమరావతి కోసం మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమం కొనసాగుతూనే ఉంది. గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు." అని పేర్కొన్నారు.

"బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ దగాపడ్డారు. ఇంతమందిని నమ్మించి మోసం చేసి బాధపెడుతూ ఏడాది పాలన అంటూ పండగలు చేసుకుంటున్నారంటే శాడిజం కాక ఇంకేంటి? ఇకనైనా పాలకులు పాలన అంటే ఏమిటో తెలుసుకోవాలి. తెలుగువారి పరువుతీయకుండా పాలించాలి." అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.