జగన్ పార్టీపై నందమూరి కుటుంబం అటాక్.. పేరు పేరునా ఖబర్దార్..
posted on Nov 20, 2021 12:19PM
నందమూరి కుటుంబం. పద్దతైన కుటుంబం. స్వచ్ఛమైన మనుషులు. ఆవేశంలేని శాంతమూర్తులు. బాలకృష్ణ మినహా రాజకీయ వాసనలు అంతగా లేని కుటుంబ సభ్యులు. ఆడా-మగా-పిల్లా.. అంతా బాధాతత్ప హృదయాలతో మీడియా ముందుకు వచ్చారు. కన్నీటిని ఆపుకుంటూనే.. కన్నెర్ర జేశారు. పెద్ద నోరేసుకొని పడకుండానే.. స్మూత్గా మాట్లాడుతూనే.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నందమూరి కుటుంబ సభ్యులు. బాలకృష్ణ, రామకృష్ణ, ఉమా మహేశ్వరి, సుహాసిని, చైతన్య కృష్ణ, శ్రీనివాస్.. ఇలా ఒక్కొక్కరూ వారి బాధను వెళ్లగక్కుతూనే, భువనేశ్వరీకి మద్దతుగా నిలిచారు. జగన్కు, జగన్ మంత్రులకు, వైసీపీ మూకలకు.. ఒక్కొక్కరి భరతం పడతామంటూ.. పేరు పేరునా హెచ్చరించారు నందమూరి కుటుంబం
తమ కుటుంబ సభ్యులపై నీచంగా మాట్లాడినా, ఇష్చమెచ్చినట్లుగా వీర్రవిగినా సహించలేదన్నారు బాలకృష్ణ. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే చాలా సంయమనం పాటించామని, ఇకపై ఎవరూ నోరు జారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బాలయ్య హెచ్చరించారు. అందరి భరతం పడతాం ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల్లో అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదన్నారు బాలయ్య. మళ్లీ ఇలాంచి నీచ, నికృష్ఠ మాటలు మాట్లాడితే తమ దెబ్బ చూపిస్తామన్నారు.
రాజకీయాల్లో విమర్శలు సహజమన్నారు బాలకృష్ణ. అంశాల వారీగా ఎవరైనా విమర్శలు చేయవచ్చన్నారు. అయితే వైసీపీ నేతలు వాడుతున్న బాష దారుణంగా ఉందన్నారు. భువనేశ్వరిపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం అత్యంత నీచమన్నారు బాలకృష్ణ. రాష్ట్రాభివృద్దికి జరగకుండా కుట్రలు చేస్తున్నారని అన్నారు. అందరి ఇండ్లలో ఆడవాళ్లు ఉన్నారు.. హేళన చేయవద్దన్నారు. వైసీపీ నేతల బాష, వేషం చూస్తే అసెంబ్లీలో ఉన్నామా లేక గొడ్ల చావిడీలో ఉన్నామో తెలియడం లేదు. అభివృద్దిపై చర్చకు బదులు వ్యక్తిగత ఎజెండాను తీసుకొచ్చారని మండిప్డడారు. మీరు మారకపోతే. మీ మెడలు వంచుతామన్నారు.
చంద్రబాబును, ఆయన కుటుంబంపై అసభ్యకరమైన కామెంట్లు చేసిన వైసీపీ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు నందమూరి రామకృష్ణ. అసెంబ్లీ జరిగిన పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంశీ, అంబటి రాంబాబుపై విరుచుకుపడ్డారు. దేవాలయం లాంటి నందమూరి ఫ్యామిలీ జోలికి వస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఓరెయ్ నానీగా, ఓరెయ్ వంశీగా, ఓరెయ్ ద్వారంపూడి... అంబటి రాంబాబు.. మరోసారి నోరు జారితే తాట తీస్తామని రామకృష్ణ హెచ్చరించారు. రాజకీయాల కోసం తమ కుటుంబాన్ని ఇబ్బందిపాలు చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పారు.
వైసీపీ ఎమ్మెల్యేలకు సిగ్గు, లజ్జా ఉందా అని నందమూరి చైతన్య కృష్ణ అన్నారు. చంద్రబాబు బాధపడుతుంటే చూడలేకపోయామన్నారు అసెంబ్లీలో భువనేశ్వరిపై అత్యంత నీచంగా మాట్లాడారని, రాజకీయాల కోసం మహిళ పట్ల ఇంత నీచంగా వ్యవహరిస్తారా అని చైతన్య ప్రశ్నించారు. వల్లభనేని వంశీ, కొడాలి నానీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడరని విమర్శించారు. వంశీ, నానీ, రాంబాబు మాటలపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించాలన్నారు. వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే వాళ్ల మాటల వెనుక జగన్ ఉన్నారన్నది స్పష్టమవుతుందన్నారు చైతన్య కృష్ణ. నందమూరి కుటుంబం ఆదర్శవంతమైన కుటుంబమన్నారు చైతన్య కృష్ణ. ఎన్టీఆర్ తమను చాలా పద్దతిగా పెంచారన్నారు.