క్రికెటర్ మహమ్మద్ షమీ ఇంటిపై దాడి

టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఇంటిపై దాడి జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన క్రీడావర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. గత శనివారం రాత్రి వెస్ట్ కోల్‌కతాలోని కట్జునగర్‌లోని తన ఇంటికి సమీపంలో షాపింగ్ ముగించుకుని షమీ, ఆయన భార్య కారులో ఇంటికి బయలుదేరారు. అయితే ప్రమాదవశాత్తూ వారి కారు ఓ బైకును ఢీకొంది. దీంతో షమీ డ్రైవర్‌తో, బైక్‌ను నడుపుతున్న వ్యక్తి వాగ్వివాదానికి దిగాడు. గొడవ పెద్దది అవుతుండటంతో షమీ కారు దిగి వచ్చి శాంతింపజేశాడు. అనంతరం షమీ భార్యతో కలిసి ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఆ కొద్దిసేపటికే కొందరు స్నేహితులను వెంటబెట్టుకు వచ్చిన సదరు యువకుడు, షమీ ఇంటివద్ద రచ్చ రచ్చ చేశారు. అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిని చితకబాది ఇంట్లోకి చొరబడేందుకు విఫలయత్నం చేశారు. దీంతో షమీ పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి యువకులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.