దొరికిపోయిన దొంగలా మోదీ సర్కార్?
posted on Feb 2, 2022 11:59AM
మోదీ ప్రభుత్వం పెగాసస్ గూఢచర్యం గుట్టు రట్టయ్యింది. ఇజ్రాయెల్- భారత్ మధ్య 2017లో జరిగిన రక్షణ పరికరాల ఒప్పందంలో పెగాసస్ ఒక ముఖ్య భాగమని ప్రముఖ అంతర్జాతీయ ఆంగ్లపత్రిక 'న్యూయార్క్ టైమ్స్' బాంబు పేల్చింది. విపక్షనేతలు, హక్కుల కార్యకర్తలు, న్యాయాధికారులు, పాత్రికేయుల ఫోన్లపై నిఘా కోసం పెగాసస్ ను ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు పేర్కొంది. 'ప్రపంచ అత్యంత శక్తిమంతమైన సైబర్ ఆయుధం కోసం పోరాటం' పేరిట వెల్లడించిన నివేదిక ఇప్పుడు సంచలనంగా మారింది. దేశంలో పెగాసస్ గూఢచర్యంపై గతేడాది అంతర్జాతీయ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చినప్పుడు, గిట్టనివారి ప్రచారమని మోదీ ప్రభుత్వం తప్పించుకుంది. తాజాగా వెలువడిన 'న్యూయార్క్ టైమ్స్' కథనంతో ప్రభుత్వ పరిస్థితి దొరికిపోయిన దొంగలా తయారైంది. ఇంతకాలం పార్లమెంట్ లోపల, బయట, చివరికి సర్వోన్నత న్యాయస్థానానికి సైతం ప్రభుత్వం అబద్ధాలే చెప్పిందని తేలిపోయింది.
పెగాసస్ పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కేంద్రాన్ని అఫిడవిట్ వేయమని కోరినప్పుడు పొంతనలేని సాకులు చెప్పింది. దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాలను కోర్టుకు సమర్పించలేమని బొంకింది. రాఫెల్ యుద్ధ విమానాల్లోనూ ఇలాగే చెప్పి బయట పడింది. ప్రతి సందర్భంలోనూ ఆ కారణం చెల్లుబాటు కాబోదన్న సుప్రీంకోర్టు పెగాసస్ ను వాడారా లేదా అని విచారించేందుకు జస్టిస్ ఆర్ వీ రవీంద్రన్ నేతృత్వంలో కమిటీని నియమించాల్సి వచ్చింది. అయినప్పటికీ మోదీ ప్రభుత్వంలో కనీస పశ్చాత్తాపం కూడా కనిపించ లేదు.
పెగాసస్ ను మోదీ ప్రభుత్వం కొనుగోలు చేసిందనే దాన్ని 'న్యూయార్క్ టైమ్స్' వెల్లడించిన అంశాలన్నీ బలపరిచేవిగానే ఉన్నాయి. 2017లో ఇజ్రాయెల్ లో పర్యటించిన ప్రధాని మోదీ, అప్పటి ఆ దేశ ప్రధాని బెంజిమిన్ తో రూ.15 వేల కోట్ల రక్షణ సంబంధ ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పుడే చెప్పుల్లేకుండా మోదీ, బెంజిమిన్ తో సముద్ర తీరానికి వ్యాహ్యాళికి వెళ్లారు. బెంజిమిన్ ను దోస్త్ గా అభివర్ణించారు. బెంజిమిన్ సైతం మన దేశానికొచ్చి మోదీని అలాగే పొగిడారు. ఆ బంధానికి కారణం 'పెగాసస్' భారీ డీల్ అని ఇప్పుడు అర్థమవుతోంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నప్పటికీ మోదీ ప్రభుత్వం దర్యాప్తునకు అంగీకరించలేదు. విపక్షాలన్నీ సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ) ఏర్పాటు చేయమని కోరినా తిరస్కరిం చింది. సాంకేతిక కారణాలతో సుప్రీం కోర్టు నుండి క్లీన్ చిట్ పొంది అదే తమ సచ్ఛీలతగా ప్రచారం చేస్తోంది. రాఫెల్ విమానాల్లో భారీగా ముడుపులు చేతులు మారాయని ఫ్రాన్స్ కోర్టుల్లో విచారణ సాగుతోంది. తన సచ్ఛీలతను నిరూపించుకునేందుకు దర్యాప్తు చేయించాల్సిన మోదీ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అజ్ఞాత కార్పొరేట్ల నుండి అత్యధిక మొత్తంలో విరాళాలు పొందిన పార్టీ బీజేపీ. ఈ విషయాలపై నోరు మెదపకుండా అవినీతిపై పోరాడతామని ప్రధాని చెప్పడం గోముఖ వ్యాఘ్రం తంతు కాదా? అనే విమర్శలు వస్తున్నాయి.
ఇజ్రాయెల్ కు చెందిన సంస్థ ఎన్ఎస్ఒ అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్ ను 2011 నుండి వివిధ దేశాల నిఘా సంస్థలకు విక్రయిస్తోంది. ఇజ్రాయెల్ విదేశాంగ, రక్షణ శాఖల ఆమోదంతోనే ఆ సంస్థ అమ్మకాలు చేస్తోంది. తాము ప్రభుత్వ సంస్థలకే అమ్ముతున్నామని ఎన్ఎస్ఒ మొదటి నుండీ నొక్కి చెబుతున్న విషయం ఇక్కడ గుర్తించాల్సి ఉంది. దానిపై మోదీ సర్కార్ నోరు మెదపడంలేదు. ఉగ్రవాద, ఇతర కరడుగట్టిన నేరస్థ నెట్వర్క్ లను ఛేదించేందుకు పెగాసస్ ను సమకూర్చుకున్న అమెరికా సంస్థ ఎఫ్బీఐపై విమర్శలు రావడంతో దాని వాడకాన్ని నిలిపేసింది. సౌదీ అరేబియా, యుఏఈ, మెక్సికో, ఫిన్లాండ్ లో స్పైవేర్ ను దుర్వినియోగం చేసినట్లు తేలింది. మన దేశంలో రాహుల్ గాంధీ,మాజీ జడ్జిలు, పాత్రికేయులు సహా 300 మందిపై నిఘా పెట్టినట్లు గతంలోనే 'ది వైర్' వెల్లడించింది. ఇది ప్రజాస్వామ్యానికి, వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం. ప్రాథమిక ప్రజాస్వామ్య వ్యవస్థలపైనా, వ్యక్తులపైనా ప్రభుత్వ నిఘాను ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలి. శ్రీరంగ నీతులు చెబుతూ.. అవినీతి పంకిలంలో, అబద్ధాల ఊబిలో నిలువునా మోదీ సర్కార్ కూరుకుపోయిందనే విమర్శలు వస్తున్నాయి.