కేబినెట్ విస్తరణలో సున్నా.. ఆంధ్రప్రదేశ్ గతి ఇంతేనా..?

14 మందిని తప్పించారు..36 మందికి కొత్తగా అవకాశమిచ్చారు. యువకులు, యువతులు..మంత్రి పదవి వస్తుందని ఊహించని వాళ్ల పేర్లు కూడా లిస్టులో ఉన్నాయి.  ఇంత జరిగినా...ఏపీ, తెలంగాణలకు మాత్రం పెద్దగా ఒరిగిందేమీ లేదు. తెలంగాణకు కనీసం కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. ఆంధ్రకు అయితే ఆ గతి కూడా లేదు.  అసలు లెక్కలోకి తీసుకున్నట్టే లేదు. కేంద్ర మంత్రివర్గ మార్పులు కూడా పూర్తిగా రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే జరిగాయి తప్ప.. అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేసినట్టు లేదు. ఎక్కడైతే ఎన్నికలు జరగబోతున్నాయో.. ఎక్కడ తమ బలం పెంచుకోక తప్పదు.. పెంచుకోవాల్సిన అవసరం ఉంది...పెంచుకునే స్కోప్ ఉంది అన్న దగ్గరే మంత్రి పదవులు దక్కాయి. యూపీకి ఇందులో అగ్రస్థానం దక్కింది. యూపీలో ప్రస్తుతం బిజెపి ప్రభుత్వమే ఉన్నప్పటికి ..9 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తుందనే అంచనాలు ఉన్నాయి. అందుకే ఆ రాష్ట్రానికి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చారు.

విభజన ఏమంటూ అయిందో గాని.. అప్పటి నుంచి ఏపీకి అన్నీ కష్టాలే.  రాజధాని లేదు. విభజన చట్టంలో చెప్పినట్లు ఆర్ధిక సహకారం ఇవ్వలేదు.  పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చిన ప్రత్యేకహోదా దక్కలేదు. కేవలం కేంద్ర విద్య, వైద్య సంస్థలను మాత్రం కొన్నిటిని మొదలెట్టి.. అవే లిస్టును బిజెపి నేతలంతా ఎప్పటికీ చదువుతూనే ఉంటారు. కనీసం ఆర్ధిక లోటు తీర్చలేదు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు అంటూనే..అప్పటివరకు రాష్ట్రప్రభుత్వం పెట్టిన ఖర్చును ఇప్పటివరకు ఇవ్వలేదు.అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చి మట్టి, నీరు ఇచ్చి వెళ్లిన ప్రధాని మోదీ.. ఢిల్లీని మించిన రాజధానిని ఇస్తామన్న మోదీ.. అందుకు ఇచ్చిన బడ్జెట్ కేవలం 2500 కోట్లు మాత్రమే. అడిగినా దిక్కు లేదు.

అడిగి అడిగి అలిసిపోయిన చంద్రబాబు ఎదురు తిరిగితే.. ఆయన ప్రత్యర్ధి జగన్ కు అన్నిరకాల అండదండలు అందించి గెలిపించారు. ఇప్పుడు కూడా ఏం పట్టించుకోవడం లేదు.కాకపోతే జగన్ చేసుకునేవాటికి అడ్డు తగలడం లేదు. చంద్రబాబు అడగలేదని లౌడ్ స్పీకర్ లో అరిచిన జగన్.. అసలు అడగలేమని చేతులెత్తేశాడు. కనీసం ఇప్పుడైనా ఒక మంత్రి పదవి ఇచ్చి.. ఏమైనా అభివృద్ధికి ముందుకు వెళతారేమోనని ఎదురు చూసినా .. ఆ ఆలోచన కూడా చేసినట్లు కనపడటం లేదు. జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.. ఆయన పేరు వచ్చినా..ఆయనకూ ఇవ్వలేదు. పవన్ కల్యాణ్ పేరు వచ్చింది.. అదీ లేదు.
ఎందుకంటే ఏపీలో ఇప్పుడప్పుడే గెలుస్తారనే నమ్మకం వారికి లేదు. ఎటూ వైసీపీ అండగా ఉంటామని లోపల, బయట చెప్పేసింది. కాకపోతే ప్రభుత్వంలో చేరలేదంతే. కాబట్టి జగన్ ను నమ్ముకునే ఏపీలో ముందుకెళ్లే పనిలో బిజెపి ఉన్నట్లు కనపడుతుంది. తమ సొంత బలం పెరగదు అనుకుంటే బిజెపి పైసా కూడా విదల్చరనేది అందరికీ క్లారిటీ వచ్చేసింది. బీహార్ లాంటి రాష్ట్రానికి ఒకప్పుడు ప్యాకేజి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పి.. అధికారానికి రాకపోవడంతో అసలు ఆ ఊసే మర్చిపోయిన చరిత్ర మోదీది. 

మొత్తం మీద అన్ని విధాల వివక్షకు గురవుతున్న ఆంధ్రప్రదేశ్...ఇంత పెద్ద మార్పులు చేసి మరీ రెడీ అయిన జంబో కేబినెట్ లో కూడా మొండి చేయి చూపించడమే పెద్దగా ఆశ్చర్యం ఏమీ కలిగించడం లేదు. ఎంపీ ఎవరూ లేరుగా అని అడగొచ్చు... ఇవ్వాలనుకుంటే ఇచ్చి..తర్వాత ఎంపీని చేయొచ్చు.. ఆ విషయం అందరికీ తెలుసు.