కార్యకర్త కుటుంబానికి మంత్రి లోకేష్ పరామర్శ
posted on May 21, 2025 4:18PM

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తాను తీసుకుంటానని, ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైసీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మంత్రి లోకేష్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలవాల గ్రామానికి చెందిన వెన్నా బాలకోటిరెడ్డి నాలుగు దశాబ్దాలుగా పార్టీ పటిష్టత, ప్రజా సంక్షేమ కోసం పనిచేశారు. దీనిని ఓర్వలేని వైసీపీ గూండాలు గత వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండతో ఇంట్లో నిద్రిస్తున్న వెన్నా బాలకోటిరెడ్డిని తుపాకీతో కాల్చి చంపారని లోకేశ్ తెలిపారు.
హత్యకు ఆరు నెలల ముందు కత్తులతో దాడికి యత్నించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని.. రక్షణ కోసం పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని మంత్రి అన్నారు. కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. దివంగత వెన్నా బాలకోటిరెడ్డి సతీమణి వెన్నా నాగేంద్రమ్మ, బాలకోటిరెడ్డి సోదరుని కుమారులు వెన్నా నరసింహారెడ్డి, వెన్నా రామకృష్ణారెడ్డిలను కలుసుకున్న మంత్రి లోకేష్.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హత్య పూర్వాపరాలు, వెన్నా నాగేంద్రమ్మ ఆరోగ్యపరిస్థితిపై వాకబు చేశారు. హత్య కేసు నిందితులు స్వేచ్ఛగా సంచరిస్తున్నారని, కేసును పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు.
ఆర్థికంగా చాలా నష్టపోయామని, ఉపాధి హామీ, గృహనిర్మాణం బిల్లులు పెండింగ్ లో ఉండటంతో పాటు తాము నివసిస్తున్న ఇల్లు తాకట్టులో ఉందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పెండింగ్ బిల్లులను చెల్లించడంతో పాటు పార్టీ పరంగా ఇంటిని తాకట్టు నుంచి విడిపిస్తానని హామీ ఇచ్చారు. హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ దాష్టీకాలకు ఎదురొడ్డి నిలిచిన అంజిరెడ్డి తాత, మంజులారెడ్డి, తోట చంద్రయ్యలే మనకు స్ఫూర్తి అని.. ఇంటికి పెద్దకొడుకులా బాధ్యత తీసుకుంటానని వారికి ధైర్యం చెప్పారు. తమకు మంత్రి లోకేష్ అండగా నిలబడటం పట్ల బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.