ఆస్తి కోసం కొడుకు వేధింపులు.. ప్రభుత్వానికి రాసిచ్చిన తండ్రి

కుటుంబాల్లో ఆస్తి గొడవలు ఇప్పుడు కామన్ గా మారిపోయాయి. దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులతో కొడుకులకు ఘర్షణలు జరుగుతున్నాయి.  కొడుకుల మధ్య, అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తి తగాదాలు చోటుచేసుకుంటున్న ఘటనలు రోజూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆస్తి కోసం తల్లిదండ్రులను, సోదరులను చంపేస్తున్న కిరాతకులు కూడా ఉంటున్నారు.  ఇటీవలే డిశాకు చెందిన ఓ మహిళ ఇటీవల తన ఆస్తి మొత్తాన్ని కుమారులకు కాకుండా ఓ రిక్షా కార్మికుడికి రాసిచ్చేసింది. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. కుమారుడితో విభేదాల కారణంగా 83 ఏళ్ల తండ్రి తన రూ. 2.5 కోట్ల స్థిరాస్తిని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చేశారు.

ఆగ్రాకు చెందిన గణేశ్ శంకర్ పాండే పొగాకు వ్యాపారి. ఆయన పెద్ద కుమారుడు దిగ్విజయ్.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రితోనే ఉంటున్నారు.  ఆస్తిని తన పేర బదిలీ చేయాలంటూ తండ్రిని రోజూ వేధింపులకు గురిచేసేవాడు. తండ్రిని ఎప్పుడూ గౌరవించకపోగా, ఆస్తి తన పేర రాసివ్వాలంటూ ఇబ్బంది పెట్టేవాడు.  ఆస్తి సంగతిని పక్కనపెట్టి ఏళ్ల తరబడి తాను కష్టపడి అభివృద్ధి చేసిన వ్యాపారంపై దృష్టిసారించాలని గణేశ్ పాండే కుమారుడికి హితవు పలికారు. అయితే, అతడు ఆ విషయాన్ని పక్కనపెట్టి ఆస్తిని దక్కించుకునేందుకు ప్రయత్నించాడు. 

కుమారుడి తీరుపై కలత చెందిన గణేశ్ పాండే తన ఆస్తి మొత్తాన్ని జిల్లా కలెక్టర్‌కు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆస్తిని ప్రభుత్వం పేర రాయించి అందుకు సంబంధించిన పత్రాలను నగర కలెక్టర్ ప్రతిపాల్ సింగ్‌కు అప్పగించారు. తాను మరణించిన తర్వాత ఈ ఆస్తిని ప్రభుత్వం వినియోగించుకోవాలని ఆ పత్రాల్లో పేర్కొన్నారు గణేశ్ పాండే. తాను జీవించడానికి అవసరమైన ధనం తన వద్ద ఉందని చెప్పారు. 

గణేశ్ శంకర్ పాండే తన ముగ్గురు తమ్ముళ్లతో కలిసి 1983లో 1000 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అందులో నలుగురూ కలిసి ఇల్లు కట్టుకున్నారు. అందరూ కలిసి అదే ఇంట్లో ఉండేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పరస్పర అంగీకారంతో ఆస్తిని నాలుగు భాగాలుగా విభజించారు.ప్రస్తుత ధర ప్రకారం ఈ ఆస్తి విలువ కోట్లలో ఉంటుందని కలెక్టర్ ప్రతిపాల్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రభు ఎన్.సింగ్ మాట్లాడుతూ.. ఈ విషయమై గణేశ్  పాండేతో చర్చిస్తామన్నారు. ఆయనకు సాయం చేస్తామని చెప్పారు. గణేశ్ కనుక ఫిర్యాదు చేస్తే తల్లిదండ్రులు, సీనియర్ సిటిజెన్స్ చట్టం కింద కుమారుడిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటన ఒడిశాలో సంచలనంగా మారింది.