పల్లా శ్రీనివాసరావుకు లోకేష్ క్లాస్.. ఎందుకో తెలుసా?
posted on May 21, 2025 11:40AM

ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫుల్ గా క్లాస్ పీకారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని దాదాపుగా హెచ్చరించినంత పని చేశారు. ఎందుకంటే.. సోమవారం (మే 19)న గ్రేటర్ విశాఖ మునిసిపల్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాల్సి ఉండగా కోరం లేని కారణంగా వాయిదా పడింది.
అలా వాయిదా పడటానికి కారణం కొందరు తెలుగుదేశం కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడమే. అసలు విషయమేంటంటే... వైసీపీ జమానాలో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను ఆ పార్టీయే దక్కించుకుంది. అయితే గత ఏడాది జరిగిన ఎన్నికలలో జగన్ పార్టీ పరాజయం పాలై, అధికారం కోల్పోయింది. తెలుగుదేశం కూటమి అద్భుత విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలను చేపట్టింది. ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాలలో వైసీపీ కార్పొరేటర్లు పలువురు ఆ పార్టీని వీడి కూటమి పార్టీల పంచన చేరారు. వారిలో అత్యధికులు తెలుగుదేశం గూటికి చేరారు. దీంతో జీవీఎంసీపై తెలుగుదేశం పట్టు సాధించింది. జీవీఎంసీ మేయర్ గా టీడీపీ నేత పీలా శ్రీనివాసరావు ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పుడు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవికి సోమవారం (మే 19) ఎన్నిక జరగాల్సి ఉంది. కూటమి ధర్మంలో భాగంగా డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ మేయర్ ఎన్నికలకు పలువురు తెలుగుదేశం కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. దీంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.
జీవీఎంసీలో కూటమికి దాదాపుగా 74 మందికి కార్పొరేటర్ల బలం ఉంది. 56 మంది హాజరైతే డిప్యూటీ మేయర్ సజావుగా సాగి ఉండేది. కానీ కేవలం 54 మంది మాత్రమే హాజరుకావడంతో కోరం లేక ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ అదికారి ప్రకటించారు. ఈ సమాచారం అందుకున్న ఇలా డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిందో, లేదో… ఆ సమాచారం నారా లోకేశ్ పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించడంపై అసంతృప్తితోనే పలువురు గైర్హాజరయ్యారని తెలుసుకున్న ఆయన గైర్హాజరైన వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. పొత్తులో మిత్రధర్మాన్ని పాటించి తీరాల్సిందేననీ, భవిష్యత్ లో మళ్లీ ఇటువంటి సంఘటన పునరావృతమైతే కఠినంగా వ్యవహరిస్తామని లోకేష్ పల్లాకు క్లాస్ పీకారట.