లోకేష్ కు మోడీ బిగ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పార్టీలో, ప్రభుత్వంలో ప్రమోషన్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కడపలో జరగనున్న పసుపు పండుగ మహానాడు వేదికగా నారా లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ ఇస్తారనీ, ఆయన కోసమే ఒక పార్టీలో ఓ కొత్త పదవి సృష్టించి మరీ ఆయనకు మరింత కీలక పదవి, కీలక బాధ్యతలు అప్పగిస్తారనీ తెలుస్తోంది. ఇక తెలుగుదేశం శ్రేణులైతే పార్టీలో ప్రమోషన్ సంగతి సరే ప్రభుత్వంలో కూడా ఆయనకు ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ చర్చలన్నీ ఇలా ఉంటే.. వీటన్నిటికీ మించిన ప్రమోషన్ లోకేష్ కు ఎప్పుడో వచ్చేసింది. ఆయన పని తీరు, ఆయన సమర్ధత, ఆయన వ్యవహారశైలి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీయే లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతే కాదు.. కుటుంబ సమేతంగా ఢిల్లీ వచ్చి తనను కలవాలని ఆహ్వానించారు. నిజమే ఈ ఆహ్వానం ఒక సారి కాదు రెండు సార్లు లోకేష్ కు దక్కింది. రెండో సారి అయితే మోడీ మరింత చనువుగా.. నేను ఆహ్వానించినా కలవరా? అంటూ లోకేష్ ను నిష్టూరమాడారు కూడా. 

సాధారణంగా ముఖ్యమంత్రులకూ, ముఖ్య నేతలకూ కూడా ప్రధాని అప్పాయింట్ మెంట్ అంత తేలిగ్గా లభించదు. రోజులు, వారాల తరబడి ఎదురు చూసినా ప్రధాని అప్పాయింట్ మెంట్ అనుమానమే. అయితే లోకేష్ విషయంలో అలా కాదు.. ప్రధానే స్వయంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు నా అప్పాయింట్ మెంట్ ఉంటుంది.. ఒక సారి వచ్చి కలవండి అంటూ లోకేష్ కు ఆహ్వానం అందజేశారు.  రెండో సారి ఒకింత నిష్టూరంగా మోడీ నేను పిలిచినా కలవరా? అంటూ మరింత ఆత్మీయంగా ఆహ్వానించడంతో లోకేష్ ఇక ఆలస్యం చేయలేదు. భార్యా కుమారుడితో సహా ఢిల్లీ వెళ్లి ప్రధానితో భేటీ అయ్యారు.  ఈ భేటీ ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో జరిగింది. లోకేష్ కుటుంబాన్ని ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్న మోడీ వారితో దాదాపు గంటన్నర సేపు గడిపారు. లోకేష్ కుమారుడు దేవాన్ష్ ను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా మాట్లాడారు. బ్రహ్మణి, లోకేష్ లను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ భేటీలో ప్రధాని, లోకేష్ మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే గత ఏడాది ఎన్నికలకు ముందు నారా లోకేష్  చేపట్టిన యువగళం పాదయాత్రకు సంబంధించిన వివరాలు, విశేషాలతో కూడిన కాఫీ టేబుల్ బుక్ ను ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించి తొలి కాపీ అందుకున్నారు. అంతే కాదు.. ఆ పుస్తకంపై తాను సంతకం చేసి మరీ లోకేష్ కు అందించి మరుపురాని ఆత్మీయ జ్ణాపకాన్ని పంచారు. లోకేష్, బ్రహ్మణి, దేవాన్ష్ లకు మోడీ ఆశీస్సులు అందజేశారు.  

ఈ సందర్భంగా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోడీ అందిస్తున్న సహకారానికి కృతజ్ణతలు తెలిపారు. అదే సఃమయంలో రాష్ట్రప్రయోజనాలకు సంబంధించి పలు అంశాలను మోడీ దృష్టికి తీసుకువచ్చి సహకారం కోరారు.  వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ తమ వంతు సహకారం అందిస్తుందని, అందుకు మోడీ దిశానిర్దేశం అవసరమనీ కోరారు. అదే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ పాలన, అభివృద్ధి తదితర అంశాలను లోకేష్ ప్రధానికి వివరించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి మరిన్ని ప్రాజెక్టులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. లోకేష్ వినతులన్నిటికీ ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ భేటీ ప్రధాని మోడీ, లోకేష్ మధ్య ఉన్న అనుబంధం రాజకీయాలకు మించి అన్న సందేశాన్ని చాటింది.ఈ అనుబంధం రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారాన్ని మరింత పెంచుతుందన్న విశ్వాసాన్ని ఇచ్చింది. 

ఇక ప్రధాని మోడీని కుటుంబంతో కలిసే అవకాశం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానంటూ లోకేష్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంత‌రం మంత్రి లోకేశ్ 'ఎక్స్'  వేదిక‌గా పెట్టిన పోస్టులో  త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్ర‌ధానిని క‌లిసే అవ‌కాశం రావ‌డం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.   ఏపీ పురోగతికి ప్రధానమంత్రి అందించిన మద్దతుకు కృతజ్ఞతలు. జాతీయ భద్రత, దేశాభివృద్ధిలో ప్రధాని నిర్ణయాత్మక నాయకత్వానికి ధ‌న్య‌వాదాలు. 2047  వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకోవడంలో రాష్ట్రం దేశానికి ఏ విధంగా తోడ్ప‌డాలో ప్రధాని నుంచి స‌ల‌హాలు తీసుకున్నానంటూ ట్వీట్ చేశారు.