ఖమ్మం ఖిల్లాకు మహర్ధశ..అభివృద్ధి పనులకు రూ.29 కోట్లు
posted on Jul 24, 2025 6:12PM

చారిత్రాత్మకమైన ఖమ్మం ఖిల్లా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.29 కోట్లు మంజూరు చేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఖిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇటీవలనే ఖిల్లాలో పాటుపడిన బావిని తిరిగి పునరుద్ధరించారు. ఖమ్మం ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే కొండపల్లి వద్ద బౌద్ధ స్థూపాన్ని కూడా అభివృద్ధి పనులు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలోని చారిత్రక ప్రదేశాలను పర్యాటకులు సందర్శించే విధంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. దీంతో ఎంతో చారిత్రక కట్టడం ఖిల్లా ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ.29 కోట్లు పర్యాటక శాఖ నుంచి కేటాయించింది. ఖిల్లా పై రోప్ వే కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఖిల్లా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
ఖమ్మం ఖిల్లా ఖమ్మం నగరం మధ్యలో స్తంబాద్రి అనే కొండపై ఉంది. దీన్ని శాసనాలు పురాతన గ్రంథాల్లో కమ్మమెట్టుగా పేర్కొన్నారు. మొట్టమొదటి ఈ కోట యొక్క బీజం ఇక్ష్వాకుల కాలంలో పడింది. కాకతీయుల పాలనకాలం సా.శ. 950లో ఖమ్మంమెట్టు నిర్మాణానికి పునాదులు పడినాయి. సుమారు 400 ఏళ్లు ఈ కోట కాకతీయుల ఆదీనంలో ఉంది.
ఈ కోటను రేఖపల్లి పరిపాలిస్తున్న సమయంలో ముసునూరి కమ్మనాయక రాజులు బలంగా నిర్మించారు. ఆ తర్వాత సూర్యదేవర కమ్మనాయక రాజులు కమ్మమెట్టును రాజధానిగా పరిపాలించారు. రేఖపల్లి చుట్టుపక్కన ఉన్న శాసనాలు మరియు ఏకశిలామకుటం, నాయకరాజ వైభవం అనే గ్రంధాల ద్వారా ఈ సమాచారం లభ్యమవుతుంది.
తర్వాత కాలంలో బహమనీ సుల్తాన్లు, కుతుబ్ షాహీ వంశస్థులు ఈ కోటను మెరుగుపరచడంలో ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. మొదట దీని పేరు ఖమ్మంమెట్టు. కుతుబ్ షాహీ వంశస్థులు దీని పేరు కమ్మమెట్టుగా ఆ తర్వాత ఖమ్మంమెట్టుగా, కుతుబ్షాహీల కాలంలో ఖమ్మం ఖిల్లాగా వ్యవహరించడం మొదలు పెట్టారు