‘సెటిలర్లు’ అని మొదట అన్నది కేసీఆరే...

 

హైదరాబాద్‌లో ‘సెటిలర్లు’ అనేవాళ్ళు ఎవరూ లేరని, హైదరాబాద్‌లో వున్నవాళ్ళందరూ హైదరాబాదీలేనని, హైదరాబాద్‌లోని ఆంధ్రావాళ్ళ కాళ్ళలో ముల్లు దిగితే తాను నోటితో తీస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ఆయన ఈ మాటలు ఏ ఉద్దేశంతో చెప్పారో ఏంటోగానీ, ప్రతిపక్షాలు మాత్రం మూకుమ్మడిగా ఆయన మీద మాటల దాడి మొదలుపెట్టేశాయి. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఆంధ్రుల ఓట్ల కోసం ఆయన ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని, ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన మళ్ళీ తన విశ్వరూపం చూపించే అవకాశం వుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు. ‘సెటిలర్లు’ అనే మాట మొదటిసారి ఉపయోగించింది కేసీఆరేనని ఆయన గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తుండటంతో ఆయన మాట మార్చి ఇలా చల్లని కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. అలాగే సచివాలయంలోకి మీడియా ప్రవేశంపై నిషేధం విధించాలన్న కేసీఆర్ ఆలోచనను కూడా ఆయన వ్యతిరేకించారు.