సచివాలయంలో మెప్మా జూట్ బ్యాగ్స్ స్టాల్స్ ప్రారంభం
posted on Aug 14, 2025 4:50PM

ఏపీ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ స్థానంలో జూట్ బ్యాగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో మెప్మా ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన జూట్ బ్యాగ్స్ స్టాల్స్ ను రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా రాష్ట్ర సచివాలయాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా ఈ జూట్ బ్యాగ్స్ స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్థానంలో పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకువచ్చే దిశలో ఈ స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
వచ్చే ఏడాది జూన్ 5 కల్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుకు నాంధి పలుకుతూ తొలుత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా రాష్ట్ర సచివాలయాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా స్టీల్ బాటిల్స్, జూట్స్ బ్యాగ్స్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇందుకై పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి మిషన్ మోడ్ లో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు.
ఈ కార్యాచరణ అమల్లో భాగంగా తొలుత రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులైన ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, స్టిక్కర్లు, సాచెట్లు మరియు ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల అమ్మకం, పంపిణీ మరియు వాడకంపై తక్షణ నిషేధాన్ని అమలు చేయడం జరుగుచున్నదన్నారు. వీటి స్థానంలో పునర్వినియోగ, బయోడిగ్రేడబుల్ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టడం జరుగుచున్నదన్నారు.
అదే విధంగా రాష్ట్ర సచివాలయంలోని అన్ని బ్లాకుల్లో త్రాగునీరు అందుబాటులో ఉండే విధంగా ఆర్.ఓ. ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరుగుచున్నదని, సచివాలయ ఉద్యోగులకు పునర్వినియోగించదగిన స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లను ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అదే విధంగా ఘన, ద్రవ్య మరియు ఇ-వ్యర్థాల సేకరణకు మూడు రంగుల డస్టు బిన్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుచున్నదన్నారు. ఈ విదంగా రాష్ట్ర సచివాలయాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా రూపొందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సహకారంతో అమలు చేయడం జరుగుచున్నదని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సచివాలయ ఉద్యోగులు, సందర్శకులు అందరూ సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ తేజ్ భరత్ పాల్గొన్నారు.