వైసీపీలో జగన్ వర్సెస్ పెద్దిరెడ్డి?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పార్టీలో అసంతృప్తి పేరుకుపోతున్న పరిస్థితులు ఉన్నాయని పార్టీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు జగన్ ఆదేశాలను ఇసుమంతైనా పట్టించుకోవడం లేదంటున్నారు. దీంతో పార్టీ పరిస్థితి బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉందనీ, జగన్ పై పార్టీలో తిరుగుబాటు వచ్చినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.  ముఖ్యంగా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ వైఖరితో విసిగిపోయారంటున్నారు వైసీపీ నేతలు. ఇటీవల పెద్దరెడ్డి తన అసమ్మతినీ, అసంతృప్తినీ బాహాటంగానే పార్టీ నేతల వద్దా, తన అనుచరుల వద్దా వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. 

వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో సీనియర్ నాయకుడు. అంతే కాకుండా వైఎస్ హయాం నుంచీ కూడా పెద్దిరెడ్డి ఆయన కుటుంబానికి విధేయంగా ఉంటూ వచ్చారు. వైఎస్ అనంతరం జగన్ తో కూడా అదే సాన్నిహిత్యం, విధేయతా ప్రదర్శిస్తూ వచ్చారు. అందుకే జగన్ ఆయనకు తన కేబినెట్ లో మంత్రిపదవి ఇవ్వడమే కాకుండా ఐదేళ్లూ మంత్రిగా కొనసాగనిచ్చారు. 

ఇక గత ఎన్నికలలో జగన్ పార్టీ అత్యంత ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో తన పట్టు నిలుపుకున్నారు. అలాగే ఆయన కుమారుడు కూడా రాజంపేట నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇంత వరకూ బాగానే ఉంది.. కానీ ఎప్పుడైతే మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డి అరెస్టయ్యారో అప్పటి నుంచీ పెద్దిరెడ్డిలో అసహనం మొదలైందంటున్నారు. మిథున్ రెడ్డి అరెస్టైన తరువాత ఇంత వరకూ జగన్ మిథున్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిసి పరామర్శించకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. కారణాలేమైనా ఒక్క మిథున్ రెడ్డి అనే కాదు..

మద్యం కుంభకోణంలో అరెస్టైన ఎవరినీ కూడా జగన్ రెడ్డి జైలుకు వెళ్లి పరామర్శించలేదు. ఆ విషయం అలా ఉండగా తాజాగా జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో  జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా జగన్  పెద్దిరెడ్డికి కీలక బాధ్యత అప్పగించారు. తాను అసెంబ్లీకి హాజరు కాకపోయినా.. పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరై పార్టీ వాయిస్ ను గట్టిగావినిపిచాలన్న జగన్  పెద్దిరెడ్డిని  ముందుండి పార్టీ సభ్యులను గైడ్ చేయాలని ఆదేశించారు. అయితే పెద్దిరెడ్డి ఆ ఆదేశాలను పాటించలేదు.. సరికదా తన వల్ల కాదని ముఖంముందే కుండబద్దలు కొట్టేశారు. అంతటితో ఆగకుండా పార్టీ అధినేత సభను బాయ్ కాట్ చేసి తనను వెళ్లమనడమేంటని పార్టీ  నేతలతో ఒకింత అసహనంతో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ విషయమే పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. పెద్దిరెడ్డి వంటి నేతే జగన్ ఆదేశాలను ఖాతరు చేయలేదంటే.. పార్టీపై జగన్ పట్టు సడలినట్టేనని అంటున్నారు.  సొంత పార్టీ నేతల విశ్వాసంపొందడంలోనే విఫలమైన జగన్ ను  జనం ఎలా నమ్ముతారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu