'పెగ్గు మీద పెగ్గు కొట్టు'.. 'జగనన్నకు చీర్స్ కొట్టు'..
posted on Jan 18, 2022 2:29PM
జగనన్నకీ జై. జగనన్నకీ చీర్స్. జగనన్న చాలా మంచోడు. ఇలా ఇప్పుడు ఏపీలో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. మద్య నిషేధమంటూ మహిళలకు బురిడీ కొట్టి.. ఇప్పుడు విచ్చలవిడిగా పెగ్గుల మీద పెగ్గులు తాగిస్తున్న ఘనత జగనన్నదే అంటున్నారు. ఒకప్పుడు సిప్పు సిప్పుకూ జగన్ను తిట్టిపోసిన తాగుబోతులంతా.. ఇప్పుడు పెగ్గు పెగ్గుకూ జగనన్న ఫోటోకి చీర్స్ కొడుతున్నారు. జగనన్నపై ప్రేమతో నాలుగో చుక్కా నేలపై వేస్తున్నారు.
మొదట్లో ఊరు, పేరు లేని బ్రాండ్లు అమ్మారు. ధర చెప్పగానే గుండెలు అదిరేలా రేట్లు పెంచేశారు. రెండున్నరేళ్లు విపరీతంగా దోచేసుకున్నారు. మద్యం రాబడితో సొంత ఖజానా, ప్రభుత్వ ఖజానానూ నింపేసుకున్నారని అంటారు. ఇప్పుడు మద్యం కిక్కు మరింత ఎక్కేలా.. కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చారు. అడ్రస్ లేని సరుకే కాకుండా.. బ్రాండెడ్ లిక్కర్ సైతం అమ్ముతున్నారు. ఇటీవల హేతుబద్దీకరణ పేరుతో రేట్స్ కూడా తగ్గించారు. అయినా, టార్గెట్ రీచ్ కావట్లేదో ఏమో.. లేటెస్ట్గా మద్యం షాపుల టైమింగ్ మరింత పెంచేశారు. ప్రస్తుతం, ఏపీలో రాత్రి 10 గంటల వరకు వైన్స్ ఓపెన్.
కట్ చేస్తే.. ఏపీలో రాత్రి 11 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ విధించింది జగన్ ప్రభుత్వం. ఎందుకంటే, రాష్ట్రంలో కొవిడ్ కేసులు విపరీతంగా పెరగటమే కారణం. మరి, కేసులు పెరుగుతుంటే, కర్ఫ్యూ విధిస్తుంటే.. మరెందుకు మద్యం షాపులు తెరిచే సమయం పెంచడం.. అంటూ లాజిక్ క్వశ్చన్ అడగొద్దు. జగనన్న కదా.. ఇలాంటి వన్నీ కామన్. ప్రజలు ఎలా పోతే ఆయనకేంటి.. తనకు కావలసింది వచ్చి పడితే అదే చాలు అనేది జగనన్న స్టైల్..అంటున్నారు.
సీఎం అయిన కొత్తలో ఎన్నెన్ని నీతి వ్యాఖ్యలు చెప్పారు. దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధమని.. ప్రజలు మందు తాగకుండా నిరుత్సాహ పరచడానికే ధరలు పెంచామని, టైమింగ్స్ తగ్గించామని.. అబ్బో ఎన్నెన్నో చెప్పారు. సగం పాలన ముగిసే సరికి.. అవన్నీ తూచ్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ను మద్యాంధ్రప్రదేశ్గా మార్చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎవరు అడిగారండి.. మద్యం షాపులు తెరిచే సమయం పెంచమని? ఎవరూ అడక్కుండానే వైన్స్ టైమింగ్స్ ఎందుకు పెంచినట్టు? కరోనా విజృంభిస్తున్న వేళ ఈ విపరీత నిర్ణయాలు ఎందుకు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నవ్విపోదురుగాక నాకేంటి? అన్నట్టు ఉంది సీఎం జగన్ తీరు అని విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా.. 2017 డిసెంబర్ 15న అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్రెడ్డి.. సీఎం చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలోని వ్యాఖ్యాలను ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
"మద్యం అమ్మి ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికీ మీరు చేస్తున్న ద్రోహం తరతరాల పాటు కుటుంబాల మీద దుష్ప్రభావం చూపుతుంది. తాగుతున్నది ప్రజలైనా ఇన్ని లక్షల కుటుంబాలను విచ్ఛిన్నం చేసేలా తాగిస్తున్నది మీరు. నేరం చేసినవాడికంటే చేయించిన వాడికి ఎక్కువ శిక్ష ఉండాలన్న సూత్రం ప్రకారం మీకు ఏ శిక్ష విధించినా తక్కువే కదా? పద్దతి మార్చుకోండి." అంటూ ఐదేళ్ల క్రితం జగనన్న అన్న మాటలు ఇప్పుడు ఆయనకే తగులుతున్నాయి. అందుకే, నవ్విపోదురుగాక మీకేంటి?