భారతీయులకు బూస్టర్ డోస్?.. కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్ట్..
posted on Nov 26, 2021 12:11PM
ప్రస్తుతం ఇండియా ప్రశాంతంగా ఉంది. కరోనా కేసులు అతి తక్కువగా ఉంటున్నాయి. కొవిడ్ టెన్షన్ దాదాపు లేదు. అయినా, బిందాస్గా ఉండే పరిస్థితి లేదు. వైరస్ వేరియంట్ మార్చుకొని.. ఏ రోజైనా విరుచుకుపడే అవకాశం ఉందనే అనుమానం ఉంది. విదేశాల్లో కొవిడ్ విజృంభణ చూసి.. మనోళ్లు బెదిరిపోతున్నారు. రెండు డోసుల టీకా వేసుకున్నా.. చాలా మంది వైరస్ బారిన పడుతుండటం ఆందోళనకర పరిణామం. అయితే, పాజిటివ్ వచ్చినా లక్షణాలు మామూలుగా ఉండటం.. ప్రాణాప్రాయం ఉండకపోవడం ఊరటనిచ్చే అంశం. అయితే, రెండు డోసుల వ్యాక్సిన్ ప్రభావం 8 నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత టీకా ఎఫెక్ట్ తుస్సు మంటుంది. అందుకే, ఫారిన్ కంట్రీస్లో ఇప్పటికే బూస్టర్ డోసు కూడా ఇచ్చేశారు. మరి, భారతీయులకు ఎప్పుడు బూస్టర్ డోస్?
తాజాగా, కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోసు అందించే విషయమై తన వైఖరిని తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పశ్చిమ దేశాలు తమ ప్రజలకు బూస్టర్ డోసు అందించాలని యోచిస్తుండగా, భారత నిపుణులు మాత్రం బూస్టర్ డోసు అవసరమన్న వైద్య నిరూపణ ఏమీ లేదని చెబుతున్నారు.
ఈ క్రమంలో వ్యాక్సిన్లకు సంబంధించిన కేసులో జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ జస్మీత్ సింగ్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. రెండో ఉద్ధృతి వంటి పరిస్థితి మళ్లీ రాకూడదని కోరుకుంటున్నామని, బూస్టర్ డోసు అందించే విషయమై కేంద్రం తన వైఖరిని తెలియజేయాలని కోరింది. ఇదే అంశం భారత ప్రధాన న్యాయమూర్తి న్యాయస్థానం ముందు పెండింగులో ఉందని కేంద్రం తెలిపింది.