ఏపీలో ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్ అడ్మిషన్లు

 

ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు ఇంజనీరింగ్, మెడికల్ ఎడ్మిషన్ల వ్యవహారంపై ఎటూ తేల్చకుండా నాన్చుతుండటంతో లక్షలాది విద్యార్ధులు వారి తల్లితండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఇటువంటి క్లిష్ట పరిస్థితులు అనేకం ఏర్పడుతాయని ఆనాడు ఆంధ్రాకు చెందిన నేతలు ఎంత మొత్తుకొన్నా వాటికి సరయిన పరిష్కారం చూపకుండా, కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ లబ్దికోసం హడావుడిగా రాష్ట్రవిభజన చేసేసి చేతులు దులుపుకొని వెళ్లిపోయింది. సరిపోయినంతమంది అధికారులు లేని కారణంగా ఇప్పకిప్పుడు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలలో ప్రవేశాల ఏర్పాట్లు చేయలేమని చేతులేత్తేసింది. ఈ వ్యవహారం రెండు రాష్ట్రాలతో ముడిపడి ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అడుగు ముందుకు వేయలేకపోయింది. అయితే ఇదే విధంగా కాలయాపన చేస్తే విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతారనే ఆలోచనతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలు చేపట్టేందుకు సిద్దం అవుతోంది. అందువల్ల చాలా కాలంగా ఈ విధానాన్ని సమర్ధంగా అమలుచేస్తున్న తమిళనాడు రాష్ట్రానికి అధ్యయనం కోసం ఒక బృందాన్ని తక్షణమే పంపుతున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఒకవేళ ఆ విధానం మన రాష్ట్రంలో కూడా అమలుచేయడానికి అనువుగా ఉన్నట్లయితే ఇంటర్ మార్కుల ఆధారంగా తక్షణమే ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలు మొదలుపెడతామని మంత్రి తెలిపారు. ప్రభుత్వానికి ఈ ఆలోచన కొంత ఆలస్యంగా వచ్చినా కనీసం ఇప్పటికయినా మేల్కొంది గనుక ఇక వీలయినంత త్వరగా ఎడ్మిషన్ల ప్రక్రియ మొదలుపెడితే బాగుంటుంది. అదేవిధంగా మెడికల్ కళాశాలలో ప్రవేశాలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించి వెంటనే వాటినీ మొదలుపెడితే ప్రభుత్వం విద్యార్ధులకు ఎంతో మేలు చేసినదవుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu