అధికార‌పార్టీ నేత‌ల నీడ‌లో పారుతున్న సారా!

లాక్ డౌన్ దెబ్బ‌తో మద్యం దుకాణాలు మూసేసి ఉన్నా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మద్యం భారీగా రోడ్డు మీద పట్టుబడుతోంది. ఇప్పటికే పలుచోట్ల మద్యం తరలిస్తున్న వారు పట్టుబడగా తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోటలో కూడా మద్యం తరలిస్తూ కొందరు పోలీసులకు చిక్కారు. అయితే ఆ తరలిస్తు‍న్న వారిలో అధికార పార్టీకి చెందిన వారే వున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మద్యం దుకాణాలన్నీ పూర్తిగా మూసేశారు. మద్యం విక్రయాలు - తరలించడం పూర్తిగా నిషేధం. అయితే ఇవేవీ పట్టించుకోకుండా అధికార పార్టీకి చెందిన నేత‌లు మ‌ద్యం త‌ర‌లిస్తున్నారు. గిద్దలూరు మండలం గడికోటలో కొందరు పెద్ద ఎత్తున మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ సభ్యుల ఎన్నికల్లో ఏకగ్రీవం గా ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికైన పిడుగు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అతడు తన కారులో మద్యం తరలిస్తుండగా ఒంగోలు ఎక్సైజ్ - ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ - సీఐ తిరుపతయ్య సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. 24 కేసుల మద్యం స్వాధీనం చేసుకుని అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ మద్యం తరలింపులో మాజీ ఎంపీపీ, ఓ వైద్యుడు కూడా వున్నాడు. ఆ వైద్యుడు గతంలో మద్యం వ్యాపారం చేశాడని - పెద్ద ఎత్తున మద్యం వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడ‌ట‌. గతంలో నంద్యాల నుంచి కల్తీ మద్యం తెచ్చి విక్రయించిన చరిత్ర అతడికి ఉందట‌. ప్రస్తుతం పోలీసుల‌కు పట్టుబడిన వారు అధికార పార్టీకి చెందిన వారు. అయితే పోలీసులు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారా? లేదా వదిలేస్తారా అనేది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.