చంద్రబాబే సీఎంగా ఉండి ఉంటేనా...
posted on May 12, 2021 12:55PM
ఆంధ్రప్రదేశ్కి ఏమైంది? ఈ కరోనా కల్లోలం ఏంటి?ఆక్సిజన్ కొరతతో పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోవడమేంటి? బెడ్స్, మెడిసిన్ లేక ఆసుపత్రుల్లో ఆ దారుణ పరిస్థితులేంటి? టీకాలకూ కుల గజ్జి అంటగట్టి.. ఈ రాజకీయ కంపు ఏంటి? ఏపీలో ఈ అరాచకమంతా ఏంటి? ఇది ఎవరి వైఫల్యం? ఇంకెవరి నిర్లక్ష్యం? ముమ్మాటికీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదే ఈ పాపమంతా అంటున్నారు ప్రజలు.
ఏపీ ప్రజలు కరోనాతో పిట్టల్లా రాలిపోతున్నా.. మన ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. తాడేపల్లిలోని ప్యాలస్ వీడి.. కదలి రావడం లేదు. ఎంత చేతగాని తనం? ఎంత చేవలేని ప్రభుత్వం? ఆంధ్రప్రదేశ్ కరోనా కోరల్లో చిక్కుకుపోయి ఇంతగా అల్లాడిపోతుంటే.. మరీ, ఇంత నిర్లక్ష్యమా? మరీ, ఇంత లెక్కలేని తనమా? అంటూ నిలదీస్తున్నారు ఆయనకు ఓటేసిన జనాలు.
ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు. ఆ తర్వాత నమ్మి మోసపోయామని గ్రహించారు. అందుకు ఫలితం రెండేళ్లుగా అనుభవిస్తున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో తాము చేసిన తప్పునకు పెద్ద శిక్షే అనుభవిస్తున్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబుతో జగన్ను పోల్చి చూసుకొని మరింత బాధపడుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటేనా.. అంటూ ఆయన పనితీరును గుర్తు చేసుకుంటున్నారు.
సీఎం చంద్రబాబు డ్యాష్ బోర్డులో.. ఏపీ కొవిడ్ సిట్యూయేషన్ మొత్తం నిక్షిప్తం అయి ఉండేది. ఎక్కడ ఏ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి.. ఏ జిల్లాలో ఎంత మంది పేషెంట్స్కి బెడ్స్ అవసరం.. ఎన్ని టెస్టులు చేస్తున్నారు.. ఎన్ని కిట్స్ అదనంగా ఉన్నాయి.. ఎక్కడ ఆక్సిజన్ అవసరం.. అదనపు ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఇలా నిత్యం.. "ఆపరేషన్ కొవిడ్" నిర్వహిస్తూ ఉండేవారు చంద్రబాబు. అధికారులను, వైద్య సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించే వారు. తాను నిద్ర పోకుండా.. ఆఫీసర్లను నిద్రపోనీకుండా.. ఏపీలో కొవిడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్ నుంచి నిత్యం పరిస్థితిని పర్యవేక్షించేవారు. గతంలో హుధ్హుధ్ తుఫాను సమయంలో ఎలాగైతే చంద్రబాబు విశాఖలోనే తిష్టవేసి.. పరిస్థితి మొత్తం బాగుచేసే వరకూ వదలకుండా పని చేశారో.. ప్రస్తుత కొవిడ్ సమయంలోనూ బాబు ఉండి ఉంటే.. అలానే నిర్విరామంగా శ్రమించేవారు. ఇప్పటిలా ఏపీ నుంచి అంబులెన్సుల్లో తెలంగాణకు రోగులు వెళ్లే దుస్థితి వచ్చుండేది కాదు.
CBN సీఎంగా ఉండి ఉంటే.. ప్రజావేదిక.. కొవిడ్ వార్ రూమ్గా మారి ఉండేది. జిల్లా అధికారులందరితో వార్ రూమ్ నుంచి 24/7 కనెక్ట్ అయ్యుండేవారు. జిల్లాకో మెడికల్ టీమ్ ఏర్పాటు చేసేవారు. ఎక్కడికక్కడ గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా తాత్కాలిక ప్రాంతీయ కొవిడ్ కేర్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటు చేసుండేవారు. ఆక్సిజన్ కొరతే లేకుండా చేసుండేవారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ.. రాష్ట్రానికి కావలసిన ఆక్సిజన్ నిల్వలను ముందే రెడీగా ఉంచేవారు. అప్పటికప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు నాంది పలికేవారు.
ప్రస్తుతం ఏపీలో వ్యాక్సినేషన్ ఓ ప్రహసనంగా సాగుతోంది. వ్యాక్సిన్ కేంద్రాల దగ్గర తోపులాటలు, గొడవలు. అదే చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే.. వ్యవహారం ఇలా కుక్కలు చింపిన ఇస్తరిలా అస్సలు ఉండకపోయేది. వ్యాక్సినేషన్పై ఇప్పటిలా కులం పేరుతో రాజకీయ కంపు సృష్టించే వారు కానే కాదు. అందరికీ సరైన రీతిలో.. ఓ పద్దతిలో.. వ్యాక్సిన్ ఇచ్చుండేవారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకునేవారు. COVID టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తే... మీకు వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందో.. ఎక్కడ, ఏ సమయంలో వ్యాక్సిన్ తీసుకోవాలో మీ మొబైల్ కి సమాచారం వచ్చుండేది.
ఇప్పటి జగన్రెడ్డి సర్కారులా వ్యాక్సిన్ కొనుగోళ్లపై మీనమేషాలు లెక్కించకుండా.. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లకు గ్లోబల్ టెండర్లు పిలిచుండేవారు. ఏపీకి కావలసిన మేర వ్యాక్సిన్ నిల్వలు రెడీగా ఉంచేవారు. రాష్ట్రంలో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు విశ్రమించకపోయేవారు చంద్రబాబు. యావత్ దేశం మన రాష్ట్రం వైపే చూసి ఉండేది. ఏపీని రోల్ మోడల్గా తీసుకునేది. అలాంటి వర్క్ హాలిక్ చంద్రబాబును కాదని, జగన్రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ఇప్పుడీ అవస్థలు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.