హైదరాబాద్‌లో దంచి కొట్టిన వర్షం..పలు చోట్ల ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో  ఉరుములు, మెరుపులతో వాన దంచి కొట్టింది.పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. వివిధ ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సహాయకచర్యల్లో తీవ్ర జాప్యం నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అబిడ్స్, నాంపల్లి, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం, గాంధీభవన్‌, కార్వాన్, కుత్బుల్లాపూర్, మియాపూర్‌, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, సికింద్రాబాద్‌, గాంధీ ఆసుపత్రి, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

లోతట్టు ప్రాంతలు నీట మునిగాయి. తెలుగు తల్లి ప్లైఓవర్, బషీర్‌బాగ్ పీజీ లా కాలేజీ రోడ్డులో చెట్లు కూలాయి.కూలిన చెట్లను వెంటనే తొలగించాలని డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని ఆదేశించారు. ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరోసారి భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రోడ్లపై నీరు నిలిస్తే వెంటనే తొలగించాలని పొన్నం సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.