"గాలి" నోట్లు మార్చిన అధికారి అరెస్ట్

కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ మైనింగ్ కేసులో నిందితుడు గాలి జనార్థన్ రెడ్డికి సన్నిహితుడైన ఉన్నతాధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ప్రత్యేక భూ సేకరణ అధికారిగా పనిచేస్తున్న భీమా నాయక్, అతడి వ్యక్తిగత డ్రైవర్ మహ్మద్‌లను ఇవాళ గుల్బార్గాలో అదుపులోకి తీసుకున్నారు. నాయక్ దగ్గర గతంలో డ్రైవర్‌గా పనిచేసిన రమేశ్ ఆత్మహత్య కేసులో వీరిని అరెస్ట్ చేశారు. గాలి జనార్థన్ రెడ్డికి చెందిన రూ.100 కోట్ల పాత నోట్లను 20 శాతం కమీషన్ తీసుకుని నాయక్ మార్చారని..ఇవన్నీ తనకు తెలియడంతో చంపేస్తామని బెదిరించారని రమేశ్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నాయక్ అతని వ్యక్తిగత డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.