గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం

 

గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అత్యవసర విభాగం వద్ద పార్కింగ్ చేసిన అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనం నుంచి బయటకు పొగలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో రోగులు, పేషెంట్ బంధువులు భయాందోళనకు గురై అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. మంటలను గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. 

అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.  ప్రమాదంలో అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది.ఏఐజీ ఆస్పత్రికి నిత్యం రోగులు వస్తుంటారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్  చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు బీఆర్‌ఎస్‌కు చెందిన రాజకీయ నేతలు ఆస్పత్రికి వచ్చి వెళ్తున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈరోజు ఉదయం ఆస్పత్రికి వచ్చి మాగంటి కుటుంబసభ్యులను పరామర్శించారు.