ఏపీలో ఒక్క రోజే 18 లక్షల మంది మహిళల ఉచిత బస్సు ప్రయాణం
posted on Aug 19, 2025 11:02AM
.webp)
ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం స్త్రీశక్తికి అద్భుతమైన స్పందన కనిపిస్తోంది. ఈ పథకం ప్రారంభమైన క్షణం నుంచీ మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కోసం ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఈ పథకం ప్రారంభంతోనూ అద్భుతమైన సక్సెస్ ను అందుకుంది. పంద్రాగస్టు సందర్భంగా ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకానికి ఆదరణ రోజు రోజుకూ పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలోనే సోమవారం (ఆగస్టు 18) ఒక్క రోజులోనే 18 లక్షల మందికి పైగా మహిళలు జీరో ఫేర్ టికెట్ తో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు.
అంటే దాదాపు 7 కోట్ల రూపాయల వరకూ మహిళలు ఈ ప్రయాణాల ద్వారా ఆదా చేసుకున్నారన్న మాట. ఈ పథకంప్రారంభమైన నాలుగు రోజుల్లోనే 47 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దాదాపు 19 కోట్ల రూపాయల మేర వారికి ఆదా అయ్యింది. అంతే కాకుండా.. రోజువారీ ప్రయాణంలో తమకు ఎంత మేర ఆదా అయ్యిందన్న విషయాన్ని మహిళలు అధికారులకు తెలియజేస్తూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఈ విషయాన్ని అధికారులు సీఎంకు తెలియజేశారు. ఇలా ఉండగా స్త్రీశక్తి పథకం వర్తించే బస్సు సర్వీసులను మహిళలు సులభంగా గుర్తిం చేలా బస్సు లోపలా బయటా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.